దేశంలోనే మొట్టమొదటి సారిగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా యూనిట్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ప్రారంభించాలని సంకల్పించింది.
ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా 27న కొత్త కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో ప్రారంభించనున్నారు.
ఔత్సాహిక చిన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలకు దీనిని ఒక వరం అని భావిస్తున్నారు. ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా పిలవబడే కొత్త కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా చిన్న తరహా పరిశ్రమల నిర్వహణకు వెసులుబాటు కలుగుతుందనేది ప్రభుత్వ ఆలోచన.
మారిన తాజా పాలసీలో భాగంగానే ఎస్ఎస్ఐ అనే పదాన్ని తొలగించి ఎంటర్ప్రైజెస్ అనే పదాన్ని ప్రభుత్వం వాడుకలోకి తెస్తోంది. మైక్రో, స్మాల్, మీడియం తరహా యూనిట్లను ప్రోత్సహించడం, సాఫ్ట్ వేర్ కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాలకు తగ్గకుండా ఇండస్త్రీయల్ క్లస్టర్లను ప్రారంభించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
అన్ని కార్యకలాపాల నిర్వహణకు సరైన వేదిక లేకపోవడంతో ముఖ్యమంత్రి లోతుగా ఆలోచించి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎవరైనా కొత్తగా సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలు, యూనిట్లను ప్రారంభించాల్సి వస్తే ఆర్థికసహాయం, నైపుణ్యాభివృద్ధి సాంకేతిక సూచనలు ఇచ్చే బాధ్యతను కార్పొరేషన్ చూసుకుంటుంది. ఉపాధి కల్పన లోను క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.