ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తర్వాత మరణించినట్లు వైద్యులు తెలిపారు.
రాత్రి 7 గంటలకు ఆయన గుండె పనిచేయడం మానేసిందని, దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని కిమ్స్ వైద్యులు చెప్పారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన బులెటిన్ను బుధవారం విడుదల చేయగలమని అన్నారు. ముందుగా ఆయన కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేస్తామని, ఆ తర్వాత మాత్రమే బయటకు విడుదల చేయగలమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సుప్రసిద్ధ నటీనటులకు హిట్ చిత్రాలనందించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు.