మృత్యుంజయుడై వచ్చిన బాలుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలుసుకున్నాడు. తన గుండె మార్పిడి చికిత్సకు ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ కింద 7 లక్షల సహాయం అందించిన చంద్రబాబును కలుసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. ఆ బాలుని హృదయస్పందనకు ముఖ్యమంత్రి చలించి అక్కున చేర్చుకున్నారు. చికిత్సానంతర వైద్యం కోసం అతడికి రూ. 5లక్షల సహాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

తూర్పు గోదావరి జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన యశ్వంత్ చందర్ రావు అనే బాలునికి పుట్టుకతోనే హృద్రోగ సమస్యలున్నాయి. అప్పటికే గుండె పనితీరు తీవ్రంగా దెబ్బతిని మృత్యువుకు చేరువయ్యాడు. వైద్య శాస్త్ర పరిభాషలో ఈ జబ్బును ‘బై వెంట్రిక్యులర్ డిస్ ఫంక్షన్’ అంటారు. బాలుని తండ్రి చనిపోయాడు. తల్లి సత్యవతి కూలిపని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు స్టార్ ఆస్పత్రి అధిపతి డా.మన్నం గోపీచంద్‌ను సంప్రదించి తమకు వైద్యానికి తగిన స్థోమత లేదని చెప్పారు. గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమని ససూచించిన డా. గోపీచంద్ ఈ శస్త్ర చికిత్సను సవాలుగా తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో వైద్య బృందం 2 గంటలు శ్రమించి.. బ్రెయిన్ డెడ్ అయిన ఒక యువకుని గుండెను ఏప్రిల్ 4 వ తేదీన బాలునికి విజయవంతంగా అమర్చారు. తెలుగురాష్ట్రాలలో ఇదే తొలి పిడియాట్రిక్ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ.

చికిత్సకు ముందే బాలుని తల్లి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సహాయం అర్ధించారు. ముఖ్యమంత్రి అప్పటికప్పుడే రూ 7 లక్షల సహాయం అందించారు. చికిత్స విజయవంతమైన తర్వాత కృతజ్ఞతలు చెప్పడానికి బాలుడు యశ్వంత్ గురువారం తనతల్లి సత్యవతి, బంధువులతో వచ్చి డా. కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నాడు. ముఖ్యమంత్రి ఆ చిన్నారిని అభినందిస్తూ.. ‘నీ పేరేమిటి?’ ‘ఏం చదువుతున్నావు?’ అంటూ కుశలప్రశ్నలు వేశారు. శస్త్ర చికిత్స విజయవంతం అయినందుకు డా. మన్నం గోపీచంద్‌ను అభినందించారు.

బాలుణ్ణి అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. శస్త్ర చికిత్సానంతరం వచ్చే దుష్ఫలితాలను నిరోధించి ఆ బాలుణ్ణి జాగ్రత్తగా కాపాడటానికి ఇమ్యునో సప్రెసివ్ మెడికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని డా. కామినేని శ్రీనివాస్, మన్నం గోపీచంద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించగా ఇందుకోసం రూ. 5 లక్షల సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ సహా, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read