రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదించాలంటే మహిళా స్వయం సహాయక సంఘాలన్నిటికీ పునర్ వైభవం సాధింపచేయడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ, కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేలు సంపాదించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి ముఖ్యమంత్రి తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రతి మహిళాసంఘ కుటుంబ సభ్యురాలికి ప్రతినెలా రూ.10వేల ఆదాయం సమకూర్చడానికి సెర్ప్ ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు, టాటా ట్రస్టు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (earnest and young) సంస్థ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు. ఈ ప్రణాళికను ఒక నెల వ్యవధిలో పూర్తి చేయాలని, ప్రతినెలా 19వ తేదిన ఈ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉండే 9లక్షల సంఘాలలోని 90 లక్షల మంది మహిళలకు ప్రతినెలా రూ.10వేలు ఆదాయం వచ్చే విధంగా చూడాలని ఆయన ‘సెర్ప్’ను నిర్ధేశించారు.

డ్వాక్రా సంఘాలలో అక్షరాస్యత పెంచేందుకు ‘ప్రథం’ అనే సంస్థ, నైపుణ్యాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ సహకరిస్తాయని చెప్పారు. హస్తకళల వస్తువులను విక్రయించేందుకు ఇ-మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పాల ఉత్పత్తులు, పశు సంవర్ధక రంగాలలో ఆదాయ ఆర్జనకు మార్గాలు విస్తృతంగా వున్నాయని, ఆయా రంగాలలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ వున్న టెక్స్‌టైల్ రంగంలో రాణించేందుకు తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తయారీరంగంలో దూసుకు వెళుతోందని గుర్తుచేస్తూ, ఈ రంగంలో వున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా డ్వాక్రా మహిళలను సన్నద్ధం చేయాలని కోరారు. ప్రాంతాల వారీగా పొదుపు మహిళలు చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో సూక్మ ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారి ఆదాయం పెంచేందుకు పథకాలు రచించాలని సూచించారు. ఈ మొత్తం ప్రణాళికలకు నిర్థిష్ట కాల పరిమితిని నిర్ధేశించుకోవాలని చెప్పారు. టాటా ట్రస్టు ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి అమలుచేయబోయే కార్యక్రమాలపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.

పశు గణ అభివృద్దిలో భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (బీఏఐఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ సహకరించడానికి ముందుకు వచ్చాయని సెర్ప్ సీఈవో పి. కృష్ణమోహన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 47లక్షల మందికి పెన్షన్లు, 2.5 కోట్ల మందికి చంద్రన్న బీమా సదుపాయం కల్పిస్తోందని, దీనికి అనుబంధంగా ప్రతి మహిళకు రూ.10వేల ఆదాయం వచ్చే ప్రణాళికలను అమలు చేయాల్సివుందని చెప్పారు. నాలెడ్జ్ పార్టనర్స్‌గా టాటా ట్రస్టు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఆధ్వర్యంలో, సేవలందించే సంస్థలు, మార్కెట్ సౌకర్యం, స్కిల్ డెవలప్ మెంట్ (APSSDC) వంటి సంస్థలను గుర్తించామని తెలిపారు.

ఈ సమావేశంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, సెర్ప్ ముఖ్యకార్యదర్శి సాల్మన్ ఆరోక్యరాజ్, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ గుప్తా, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, ట్రైబల్ వెల్పేర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, వెనకబడిన తరగతుల ప్రత్యేక కార్యదర్శి అనంతరాము, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి, మత్య్సశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక కమిషనర్ సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అపర్ణ, ప్రత్యేక కమిషనర్ అరుణ కుమార్ పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read