ఎప్పుడూ పని పని అని కాళ్ళకి బలపం కట్టుకుని తిరిగే చంద్రబాబులో ఈ మధ్య చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ గుంభనంగా ఉంటూ, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్ప, తనలోని ఎమోషన్స్ అంత తేలికగా బయటకి చూపించారు. కాని ఈ ధోరణిలో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తుంది.
ఆరు పదుల వయసులో, ఎవరైనా హాయిగా పిల్లలతో టైం గడుపుతూ ఉంటారు... కాని, చంద్రబాబుకి తన మనవడితో ఆడుకునే తీరిక లేదు... అందుకేనేమో, ఈ పిల్లడు కనిపించగానే, ఎత్తుకుని మరీ ముద్దాడారు... ఎంత ముఖ్యమంత్రి అయినా, వయసుతో పాటు వచ్చే ఎమోషన్స్ ఆపుకోలేరు కదా...
విషయంలోకి వెళ్తే, పశ్చిమగోదావరి జిల్లా పోతవరం గ్రామ సర్పంచ్ పసుమర్తి రతీష్, స్వప్న దంపతుల కుమారుడు పసుమర్తి ప్రతీత్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎత్తుకుని ముద్దాడారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన రెండంతస్థుల పంచాయతీ భవనాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి చిన్నారి ప్రతీక్తో హాజరైన సర్పంచ్ దంపతుల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీక్ను ఎత్తుకుని ముద్దాడారు. పసుమర్తి రతీష్ తాత మాజీ సర్పంచ్ పసుమర్తి వెంకన్న పేరుతో పై అంతస్థు భవనాన్ని నిర్మించడం పట్ల సీఎం చంద్రబాబు వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా రతీష్ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటో దిగి వారందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. డబ్బు సంపాదన ఎంత ముఖ్యమో సమాజంలో సామాజిక కార్యక్రమాల కోసం ధనం వెచ్చించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రతీష్ తండ్రి ప్రభాకరరావు కూడా సమాజాభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు విరాళంగా ఇవ్వడం పసుమర్తి కుటుంబం దాతృత్వానికి నిదర్శనంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు.