సౌదీ ఆరాంకో ప్రతినిధులతో భేటీ
భారత్ లో ఒక రిఫైనరీ ఏర్పాటు అవకాశం
కేజీ బేసిన్ ప్రత్యేకతలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
పెట్రోయూనివర్శిటీలో భాగస్వామ్యం
ప్రతిపాదించిన సీఎం
15 రోజుల్లో రాష్ట్రానికి సౌదీ ఆరాంకో బృందం
ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్న పెట్రోలియం యూనివర్శిటీలో భాగస్వామి కావాలని చమురు, సహజవాయు, రిఫైనరీ రంగాలలో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ ఆరాంకో (Aramco) సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దావోస్ లో ప్రపంప ఆర్ధికవేదిక సదస్సులో బుధవారం సౌదీ ఆరాంకో సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ అమిన్ హెచ్.నాసర్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత్ లో ఒక ఆయిల్ రిఫైనరీ నెలకొల్పే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అమిన్ తెలుపగా, చమురు, సహజవాయు రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు, అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
కృష్ణా గోదావరి బేసిన్ లో హైడ్రో కార్బన్ నిక్షేపాలు, టెక్నాలజీ, మానవవనరులపై ముఖ్యమంత్రి వివరిస్తున్నప్పుడు సౌదీ ఆరాంకో ప్రతినిధులు ఆసక్తిగా విన్నారు. ప్రతిపాదిత పెట్రో యూనివర్సిటీ వివరాలపై ఆసక్తి ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసిపనిచేయాలని ఉందని, అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. సౌదీలో తమ సంస్థను పరిశీలించటానికి ఒక బృందాన్ని పంపాలని ఆరాంకో హెడ్స్ కోరగా త్వరలో పంపిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే 15 రోజుల్లో తమ బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుందని ఆరాంకో సీఈఓ నాజర్ తెలిపారు. సమావేశంలో సంస్థకు చెందిన అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్స్ పాల్గొన్నారు.