కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామం విజయవాడ –హైదరాబాద్ జాతీయ రహదారి పై ఎత్తయిన ఆంజనేయ విగ్రహం ఉంది. రామ పాద క్షేత్రంగా పేరున్న ఇక్కడ, వీర అభయ ఆంజనేయ విగ్రహాన్ని 15 అడుగుల పీఠ భవనం పై, 135 అడుగుల ఎత్తుతో నిర్మించారు. తెల్లని కాంతితో మెరిసే ఈ భారీ శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం, చుట్టుప్రక్కల అయిదుకిలో మీటర్ల దూరానికి కూడా దర్శనమిస్తుంది. పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కూడా కనిపిస్తుందంటారు. స్వామి కుడి చేయి అభయమిస్తూ కన్పించి భక్తులకు తానూ అండగా ఉన్నాననే భావన కల్పిస్తారు. ఇదంతా ఒక ఆలయ సముదాయం, ఇందులో రేణుకా దేవికి, సీతారాములకు ఉపాలయాలున్నాయి.
సాయిబాబా భక్తుడైన బోమిడిపాటి వెంకటేశ్వరరావు గారు ఈ స్థలాన్ని విరాళంగా అందజేసి, శ్రీ రామక్షేత్ర టెంపుల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహాయం చేశారు. ఆలయం ప్రాంగణంలో మలయ స్వామి వేద పాఠశాలను నెలకొల్పి, వేద విద్యనూ నేర్పుతున్నారు.
28-4-2001న శ్రీ పరిపూర్నానంద స్వామి శంకుస్థాపన చేశారు. 22-6-2003 సద్గురు శ్రీ శివానందమూర్తి గారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారు. కోటిన్నర రూపాయల వ్యయం తో నిర్మించిన భారీ ప్రాజెక్ట్ ఇది. ఆవిష్కరణకు ముందు 2000 సంవత్సరం మే నెల 28న, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించి, ఆపకుండా, లక్షా ముప్ఫై అయిదు వేల సార్లు పారాయణం చేసి చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని భక్తులు కలిగించారు. ఒక్కో అడుగు ఎత్తుకు వెయ్యి చొప్పున పారాయణ జరిగింది అన్నమాట.
ఇక్కడి విగ్రహం బరువు 2,500 టన్నులు... నిర్మాణ కాలం 25 నెలలు.... నిర్మాణానికి వాడిన సిమెంటు 14 వేల టన్నులు... ఇనుము 150 టన్నులు... ఇసుక వెయ్యి లారీలు... విగ్రహం పాదమే ఆరడుగుల ఎత్తులో ఉంది.. విగ్రహం చేతిలోని గద చుట్టుకొలత 20 అడుగులు.
ఈ క్రింది వీడియో చూడండి, ఎంత అద్భుతంగా, ఆలయం ఉందో...