ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ, సీపీఎం, జనసేన, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌ రోడ్డులో శుక్రవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంపై తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో పలుమార్లు మాట్లాడానని.. ఎప్పుడూ తప్పుడు సమాచారమే ఇచ్చారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై మాట తప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంట్‌ లోపల, బయట హోదా సాధనకు పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోందన్నారు. అంతా సంఘటితంగా పోరాడితేనే కేంద్రంలో రాజకీయ మార్పు సాధించగలమని... అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించగలమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను అమలు చేయాలని, రాష్ట్రానికి ఆర్థికంగా సహాయపడాలని, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు జైట్లీని కలిశారు.

jaitley 05012019 2

ఈ సందర్భంగా జైట్లీ ఎగతాళిగా మాట్లాడారు. ‘నవ్యాంధ్ర రాజధానికి రూ.3500 కోట్లు ఇచ్చాం. కానీ... అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదు’ అని అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. రాజధానిలో ఐదు భవనాల నిర్మాణానికి మాత్రమే నిధులివ్వాలని బిల్లులో ఉందని జైట్లీ తెలిపారు. అది సరికాదని, రాజధానిలో 90 శాతం మౌలిక వసతుల కల్పనకు కూడా కేంద్రం నిధులివ్వాలని విభజన చట్టంలో ఉందని, దానిని చదువుకోవాలని చలసాని శ్రీనివాస్‌ కేంద్ర మంత్రి జైట్లీని కోరారు. వెనుకబడి ప్రాంతాలకు నిధులను గత మూడేళ్లుగా ఇవ్వలేదని సీపీఐ నేత రామకృష్ణ గుర్తు చేయగా... రూ.350 కోట్లే ఇవ్వాల్సి ఉన్నదని, వాటిని విడుదల చేస్తామని జైట్లీ జవాబిచ్చారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ... పైసా కూడా ఇవ్వలేదని సమితి సభ్యులు గట్టిగా చెప్పారు.

jaitley 05012019 3

వెనుకబడిన జిల్లాలకు గత ఏడాది ఇచ్చిన రూ.350 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకుంది. దాంతోపాటు ఈ ఏడాదికి సంబంధించిన నిధులను కూడా వెంటనే నవ్యాంధ్రకు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ... మరో 350 కోట్లు మాత్రమే ఇవ్వాలని జైట్లీ చెప్పడం గమనార్హం. మరోవైపు... అచ్చంగా రాజధాని అమరావతికి కేంద్రం ఇచ్చిన నిధులు రూ.1500 కోట్లు మాత్రమే. విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీకి ఇచ్చిన వెయ్యి కోట్లను కూడా రాజధాని ఖాతాలో కలిపారు. అది కలిపినా రూ.2500 కోట్లే ఇచ్చినట్లు! కానీ, జైట్లీ 3500 కోట్లు ఇచ్చామనడం, పైగా అక్కడ ఏమీ కట్టలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతటితో ఆగకుండా... తమిళనాడు, కేరళ లెఫ్ట్‌ ఎంపీలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘మీ రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోతపెట్టి ఏపీకి ఇస్తే మీకు అంగీకారమేనా?’ హోదా సాధన సమితి సభ్యులతో తన వద్దకు వచ్చిన ఎంపీలు డి.రాజా, వినయ్‌ విశ్వంలను ప్రశ్నించారు. విశాఖలో రైల్వే జోన్‌, కడప ఉక్కు తదితర అంశాలపై ‘పరిశీలిస్తాం’ అని మాత్రమే చట్టంలో ఉందని పాతపాటే పాడారు. కాగా, అరుణ్‌ జైట్లీ వైఖరి చూస్తుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగదని అర్థమవుతోందని, ప్రతి దానికీ ఆయన నెగటివ్‌గా సమాధానాలిస్తున్నారని భజన హామీల సాధన సమితి నేతలు అంటున్నారు.

Advertisements