‘మనం ఓడిపోతామని ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. నేను ప్రజలకు న్యాయం చేశాను. సంక్షేమం, అభివృద్ధి అందించాను. అన్నిట్లో నెంబర్‌ 1గా ఉన్నాం. మేమే ఓడిపోతే మీకేమైనా చిరునామా ఉంటుందా..? డిపాజిట్లు వస్తాయా..? అసలు మీ విషయం ఏమిటి..? మీరు దేశానికి ఏమి చేశారని నిలదీస్తున్నా.. మీ వల్ల ఒక్క పనైందా..? లాభం వచ్చిందా... కష్టాలే వచ్చాయి...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రఫేల్‌ యుద్ధ విమానాల విషయంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి మా గురించి మాట్లాడతారా? తక్కువ అవినీతి ఉండే వాటిల్లో మూడోరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నిస్తే మీ సమాధానం ఏమిటి. మమ్మల్ని బెదిరించలేరు. అణగదొక్కలేరు. మా పని మేము చేస్తాం.. మాకా తెలివితేటలు ఉన్నాయి...’ అని సీఎం వ్యాఖ్యానించారు.

cbn 05012019

‘ మీరు ఇవ్వకపోయినా మేమే స్టీల్‌ప్లాంటు, పెట్రోకెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుకు ముందుకొచ్చాం. కేంద్రం ముందుకొచ్చి ఉంటే రూ.32వేల కోట్లే పెట్టేవారు. ఇప్పుడు రూ.63వేల కోట్లతో హల్దియా పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ వస్తోంది. 5వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలొస్తాయి...’ అని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ మైదానంలో శుక్రవారం జరిగిన జన్మభూమి-మావూరులో, తొలుత అధికారులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. నరేంద్రమోదీ సీబీఐ కత్తిని మెడపై పెట్టడంతో జగన్‌ వణికిపోతున్నారని..ఊడిగం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో ఏపీతో పోటీపడలేక కేసీఆర్‌, జగన్‌... మోదీ జపం చేస్తున్నారని విమర్శించారు. కోడికత్తి పార్టీని పెట్టుకుంటే మనం మునిగిపోతామని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

cbn 05012019

రూ.75వేల కోట్లు రావాలని చెప్పిన పవన్‌కల్యాణ్‌ ఆ నిధుల కోసం పోరాడి రాష్ట్రానికి న్యాయం చేయాలని సూచించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. ఈ గడ్డపై పుట్టిన, ఇక్కడి నీళ్లు తాగిన ప్రతిఒక్కరూ జన్మభూమి సాక్షిగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ‘నా జీవితం అయిదు కోట్ల రాష్ట్ర ప్రజలకు అంకితం. రాత్రి పగలు పని చేస్తా. ఎంత సంక్షేమాన్ని అందిస్తే అంత ఆనందానికి గురవుతా. ఎప్పుడూ వ్యక్తిగత విలాసాలకు పోలేదు. ఇన్నాళ్లు 24 గంటలూ మీ గురించే ఆలోచించా. మీ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి నా కోసం.. పార్టీ కోసం మీరంతా ఆలోచించాలి. నిండు మనసుతో ఆశీర్వదించండి. సంక్షేమానికి తొలిసారిగా నాంది పలికింది ఎన్టీ రామారావు. పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేసిన మహానుభావుడు ఆయన. ఆ స్ఫూర్తిని తెదేపా భవిష్యత్తులోనూ కొనసాగిస్తుంది. నిత్యం పేదల కోసమే పనిచేస్తోంది...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisements