ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ రోజు అమరావతిలోని మందడం శిబిరంలో, నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఏడాదిగా నిరసన తెలుపుతున్న వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతులు తాము పడుతున్న కష్టాలు, ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు చెప్పుకున్నారు. అలాగే అసెంబ్లీలో పలువురు వైసిపీ నేతలు వాడుతున్న భాష పై కూడా అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి ధైర్యం చెప్తూ, భావోద్వేగానికి లోనయ్యారు.  ఆయన మాటల్లోనే "నాకు అర్ధమైంది, మిమ్మల్ని పెట్టారు, అందరినీ ఇబ్బంది పెడతారు, రాష్ట్రాన్ని కూడా పెడుతున్నారు, కానీ తప్పదు, ధైర్యంగా పోరాడాలి. ఇక్కడ ఉండే రైతులకు కూడా బేడీలు వేసారు, జైలుకు పంపించారు. బయట వాళ్ళు ఎవరో ఒక పది మంది వచ్చి, నా మీదకు వస్తే నేను భయపడే వాడిని కాదు, నేను బాంబులకే భయపడలేదు. నా సంకల్పం ముందు, వీళ్ళు ఏమి చేయలేరు. మీరు అన్నట్టు, నన్ను అసెంబ్లీలో అవమానం చేసారు, బయట అవమానం చేసారు, ఇస్తానుసారంగా మాట్లాడుతున్నారు, కొంత మంది పోలీసులు కూడా కావాలని ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ గుండెల్లో పెట్టుకుని ఉన్నా, బాధపడుతున్నా, భరిస్తున్నా, అయినా కూడా నేను ఎక్కడ భయ పడటం లేదు. వీళ్ళతో చివరి వరకు పోరాడతా, ఎన్ని అవమానాలు అయినా భరిస్తా, ప్రజల తరుపున అండగా ఉంటాను." అని చంద్రబాబు అన్నారు.

Advertisements