ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకి ఫోన్ చేసారు. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా, కర్ణాటకలో ఉడుపి జిల్లా మాల్పే గ్రామంలో చిక్కుకు పోయిన శ్రీకాకులం జిల్లా మత్స్యకారులు 300మందికి, ఆహారం లేక అగచాట్లు పడుతున్నారని, వారికి తక్షణ సహాయం నిమిత్తం ఆదుకోవాలని, అలాగే వారిని ఆంధ్రప్రదేశ్ లోని స్వస్థలాలకు వారిని తరలించడం గురించి, చంద్రబాబు, యడ్యూరప్పతో మాట్లాడారు. కోవిడ్ 19పై కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నానని చంద్రబాబు చెప్తూ, ఈ విపత్కర సమయంలో మేమంతా మీతోపాటు కర్ణాటక ప్రజలకు సంఘీభావంగా ఉంటాం. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన ఏపి కార్మికులు అనేకమంది ఆయా ప్రాంతాలలో అష్టకష్టాలు పడుతున్నారని, ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300మంది మత్స్యకారులు కర్ణాటకలోని ఉడిపి జిల్లా మాల్పే గ్రామంలో చిక్కుకుపోయిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకు వస్తున్నానని అన్నారు. వారి యోగక్షేమాలపై స్థానికంగా ఆయా కుటుంబాల సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు తల్లడిల్లుతున్నారని, వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయా కుటుంబాల తరఫున, ప్రత్యేకించి నా తరఫున మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నానని అన్నారు. అది వీలుగాని పక్షంలో లాక్ డౌన్ పూర్తయ్యేదాకా వారికి అక్కడే ఆశ్రయం, ఆహారం, తాగునీరు, వైద్య సాయం ఇతర నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరుతున్నానని అన్నారు.

సదరు తెలుగు మత్స్యకారులను ఆదుకునేందుకుగాను అక్కడ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తీ ఫోన్ నంబర్ కూడా ఇచ్చి, అతన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేసారు. చంద్రబాబు ఇప్పటికే ఇలాగే విదేశాల్లో చికుకున్న వారి గురించి, వారిని క్షేమంగా ఇంటికి తీసుకురావటం గురించి, కేంద్రానికి విజ్ఞప్తులు చెయ్యటం, అవి పరిష్కారం అయిన విషయం తెలిసిందే. అలాగే, మహారాష్ట్రలో చిక్కుకున్న తెలుగు వారికోసం, గుజరాత్ లో చిక్కుకున్న వారి కోసం, తమిళనాడులో చిక్కుకున్న వారి కోసం,కూడా చంద్రబాబు ఇలాగే లేఖలు రాసి, అక్కడి ముఖ్యమంత్రులతో మాట్లాడి, సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేసారు, చంద్రబాబు.

Advertisements