చీరాల నవాబ్ పేటకు చెందిన దంపతుల కరోనా పాజిటివ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి కాంటాక్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వారితో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందినవారు సుమారు 280 మంది ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మరో 200 మంది, చీరాల రైల్వేస్టేషన్‌లో 80 మంది దిగినట్టు తెలుస్తోంది. వీరి గుర్తింపులో జాప్యం జరిగితే భారీ మూల్యం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో జిల్లాలో 5 వేల మందికి క్వారంటైన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. చీరాలలో ఇద్దరికి, ఒంగోలులో ఒక కేసు నిర్ధారణ కావడంతో మొత్తం జిల్లాలో మూడు కొవిడ్-19 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.

కేసులు నమోదైన ప్రాంతం నుంచి 300 మీటర్లు హై సెన్సిటివ్ జోన్​గా, మూడు కిలోమీట్లర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. చీరాల, వేటపాలెం మండల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కొవిడ్ - 19 కేసులపై వైద్యారోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ 16 శాంపిల్స్​ను పరీక్షించగా నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ఈ రోజు విదేశాల నుంచి ఎవరూ రాలేదని పేర్కొంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 29,367 అని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,172 మందిని హోం క్వారంటైన్​లో ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 195 మంది ఆస్పత్రుల్లో ఉన్నారని తెలిపింది.

ఇప్పటి వరకు 433 శాంపిల్స్​ల్లో 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసింది. రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ కాగా.. అతను హైదరాబాద్​లోని గాంధీ మెడికల్​ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా నిర్ధారణ కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వం... తాజాగా అనంతపురంలో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. కరోనాకు సంబంధించి శనివారం 537 ఫోన్ కాల్స్ వచ్చాయని.. వాటిపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బులెటిన్​లో ప్రస్తావించింది.

Advertisements