రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులు, అలాగే ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా చికిత్సకు వినియోగించుకునే హక్కులు వచ్చేలా, ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ఆదేశాలు వెలువరించింది. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లోని గదులు, వెంటిలేటర్లు, ప్రయోగశాలలు, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలు, డాక్టర్లు, నర్సులు, మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది సేవల వినియోగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్య నిపుణుల సేవలను అవసరమైన చోట తక్షణం వినియోగించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని మంత్రి కురసాల కన్నబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కరోనా నివారణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. వైద్య పరమైన అంశాల్లో మరిని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులను సైతం వినియోగిస్తామని అన్నారు. ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతున్నామని... క్వారంటైన్ కేంద్రాల్లో పర్యవేక్షక ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్ సామర్థ్యంతో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలోనూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

క్షేత్రస్థాయిలోని బాధ్యతలను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు చెప్పారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపుతామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. జిల్లా జేసీలు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. విక్రేతలు బోర్డుల్లో ధరలు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి పింఛను మొత్తాన్ని డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. వృద్ధులు, అనాథ, శిశు ఆలయాల్లో ఉచిత బియ్యం, కందిపప్పు అందిస్తామని అన్నారు.

Advertisements