రెండు రోజుల క్రితం, ఏబీఎన్ ఛానల్ లో రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ ఒకటి ప్రసారం అయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా మేజిస్ట్రేట్ రామకృష్ణ వ్యవహారంలో, ఈ సంఘటన జరిగింది. ఆ ఛానల్ ప్రసారం చేసిన ఫోన్ సంబాషణలో, ఈశ్వరయ్య ఢిల్లీ జడ్జిల సంగతి చూస్తా అని చెప్పటం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పై చర్యలు తీసుకోవాలని నేనే లెటర్ రాసాను అని చెప్పటం, అలాగే నిన్ను జగన్ దగ్గరకు తీసుకువెళ్ళి విషయం చూస్తాను అని చెప్పటం, అలాగే మరొక జడ్జిని తిట్టటం లాంటివి వినిపించాయి. అయితే ఆ రోజు ఏబీఎన్ ఛానెల్ ఫోన్ చేస్తే, రామకృష్ణ ఎవరో నాకు తెలియదు, ఆ ఆడియో నాది కాదు అని ఈశ్వరయ్య చెప్పారు. అయితే రెండు రోజుల తరువాత, జస్టిస్ ఈశ్వరయ్య ఈ విషయం పై ప్రెస్ మీట్ పెట్టి, తన పై తిరుగుతున్న ఆడియో టేప్ గురించి, తన పై వస్తున్న వార్తలు గురించి వివరించే ప్రయత్నం చేసారు. ముందుగా ఆయన మాట్లాడుతూ, రామకృష్ణతో జరిగిన ఫోన్ సంభాషణ నిజమే అని ఒప్పుకున్నారు.

అయితే అందులో కొన్ని టాంపరింగ్ చేసి పెట్టారని, ఆయన చెప్పుకొచ్చారు. టాంపెరింగ్ అంటే మిమిక్రీ చేసారా అనే విలేకరులు అడగగా, అవి తనకు తెలియదు అని, ఆడియోలో టాంపరింగ్ అయితే చేసారని, తాను రామకృష్ణతో మాట్లాడింది నిజం అని అన్నారు. అయితే తనకు ఏదో సహాయం చేద్దాం అనే ఉద్దేశం ఉంది తప్ప, తనకు ఎలాంటి ఆలోచనలు లేవని, మీడియా కూడా ఆ దృష్టిలోనే చూడాలని అన్నారు. తాను బీసిల కోసం పోరాటం చేసే వ్యక్తిని అని చెప్పారు. అయితే ఈ సందర్భంలో ఒక విలేఖరి, మరి ఈ ప్రభుత్వంలో అన్నీ ఒకే సామాజికవర్గానికి ఇస్తుంటే ఎందుకు ప్రశ్నించటం లేదు అని అడగగా, ఆ విషయం పై తాను మాట్లాడను అని, ఈ రోజు ఈ విషయం పై మాత్రమే మాట్లాడుతా అని చెప్పి తప్పించుకున్నారు. అలాగే హైకోర్టు సిజే పై రాసిన లేఖ గురించి ప్రశ్నించగా, ఆ విషయం కోర్టులో ఉంది కాబట్టి, అక్కడే మాట్లాడతా అని అన్నారు. మాటిమాటికి బీసిలను ఎందుకు ఇందులోకి తెస్తున్నారు, ఇది మీ వ్యక్తిగత ఫోన్ సంభాషణ కదా అని అడగగా, ఆయన కొన్ని ప్రశ్నలకు ఇబ్బంది పడి, విలేఖరులు సమావేశం అర్ధంతరంగా ముగించి వెళ్ళిపోయారు.

Advertisements