వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, అమరావతి పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను అభినందించారు. ప్రభుత్వం మనసులో ఉన్నది ఈయన చెప్పారని, అమరావతిని కనీసం శాసన రాజధానిగా కూడా ఉంచకూడదు అనే ప్రభుత్వ అంతరంగాన్ని, నాని చెప్పారని అన్నారు. రఘురామరాజు మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని, విశాఖపట్నంకు తరలిస్తున్నారని, మనం గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఈ రోజు ఈ విషయంలో, మంత్రి కొడాలి నాని గారు, ఆ నిజాన్ని బహిర్గత పరిచారు. ఎందుకుంటే ఈ అంశం కోర్టులో ఉంది. రైతుల దగ్గర భూమి తీసుకున్నారు. తీసుకుని ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ రాసారు. సిఆర్డీఏ వాళ్ళు. అగ్రిమెంట్ లో ఏమన్నారు, మేము ఇక్కడ రాజధాని నిర్మిస్తాం, రాజధాని అంటే రాజభవన్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, హెచ్ఓడీలు ఉంటాయి అని ఒక మాస్టర్ ప్లాన్ చెప్పి, అగ్రిమెంట్ చేసారు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చెయ్యరు అంట, డబ్బులు లేవు అంట, రాజభవన్, సెక్రటేరియట్ విశాఖలో కట్టుకుంటారు అంట, అవసరం అయితే ఒక సెషన్ అసెంబ్లీ కూడా విశాఖలో చెయ్యటానికి అసెంబ్లీ కూడా కట్టుకుంటారు అంట. రెండు సెషన్స్ అసెంబ్లీ అమరావతిలో పెడతారు అంట. రైతులు ఇచ్చిన భూమిని అభివృద్ధి చెయ్యకుండా, పేదలకు పంచుతారు అంట. "

"పేదలకు పంచుతూ, అందరం ఒప్పుకోవాలి అంట, అది కోర్టులో ప్రశ్నిస్తే, మీరు కోర్టులో వేసిన కేసులని విత్ డ్రా చేసుకోక పొతే, ఈ చిన్న రాజధానిని కూడా అమరావతిగా ఉంచం అని చెప్పి, మంత్రి గారు అంటున్నారు. మరి అది వార్నింగ్ అనాలో, లేక మరి ఇంకేమి అనుకోవాలో. ఒక పక్క కోర్టులో కేసు ఉండగానే, ఈ రకంగా బెదిరిస్తున్నారు అంటే, వీళ్ళు ఎలా ఉన్నారో చూసుకోవాలి. నాని గారు ఏమి మాట్లాడినా కూడా, వారి ఎక్స్ప్రెషన్ లో ఉన్న మాధుర్యం, మా లాంటి వారి కంటే, జగన్, చంద్రబాబు గారి కంటే, నాని గారికి, ఎక్కువ వ్యూస్ వస్తాయి. పితృ భాష ఎక్కువగా వాడతారు కాబట్టి, ఆ భాష నచ్చే వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువగా ఆయన ప్రసంగాలు వింటారు. ఈ విషయంలో అయితే మా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నాని గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే మీ మనసులో దాగి ఉన్న నిజాన్ని ఈ రోజు, ప్రజలకు మీడియా సాక్షిగా తెలియచేసి నందుకు, ప్రభుత్వ అంతరంగాన్ని తెలియచేస్తూ, అమరావతిలో ఈ రాజధాని కూడా ఉంచం అని చెప్పినందుకు సంతోషం" అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

Advertisements