చంద్ర‌బాబు వ‌ల్లే బ‌తికి ఉన్నామ‌ని, బాబు ప్లేసులో జ‌గ‌న్ ఉంటే త‌మ‌ని చంపించేవార‌ని కొండా ముర‌ళి, సురేఖ‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ ఎంత క్రూరంగా ఉంటాడో వారు వివ‌రించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌న ప్ర‌త్య‌ర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి కొండా మురళిని ఎన్‌కౌంటర్‌ చేయాలని కాళ్లా వేళ్లా ప‌డి బ‌తిమ‌లాడినా సీబీఎన్ ఒప్పుకోలేద‌ని, సీఎంగా జగన్ అప్పుడు అయి ఉంటే తనను ఎన్‌కౌంటర్‌ చేయించి ఉండేవారని కొండా మురళి వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. జగన్ రెడ్డిది వక్రబుద్ది అని దుయ్య‌బ‌ట్టారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్ కి ఎమ్మెల్సీ ఇస్తామ‌ని త‌మ‌కు చెప్పి, ఆరు కోట్లు తీసుకుని వేరొక వ్య‌క్తికి జగన్ అమ్మేశార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కి జ‌నం రాక‌పోతే, ఏడ్చుకున్నార‌ని,  దీంతో బస్సులు పెట్టి 25వేల మందిని త‌ర‌లించామ‌ని దంప‌తులు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఆదేశిస్తే పార్టీ తరపున తాము ఏపీలో ప్రచారం చేస్తామని, జగన్‌ వ్యక్తిత్వం ఎలాంటిదో అక్కడి ప్రజలకు వివరిస్తామని కొండా దంపతులు వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ కోసం పదవులకు రాజీనామా చేసినందుకు తాము ఎన్నడూ బాధపడబోమని.. కానీ ఆయ‌న త‌న‌యుడు జగన్ మోహ‌న్ రెడ్డితో నడిచినందుకు మాత్రం తీవ్ర ఆవేద‌న చెందుతున్నామ‌న్నారు. జగన్‌ కోసం తెలంగాణ ద్రోహులమ‌య్యామ‌ని, మానుకోట రాళ్లదాడిని ఎదుర్కొన్నామ‌ని ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో అస్స‌లు న‌మ్మ‌కూడ‌ని నాయ‌కుడు జగన్ అని కొండా దంప‌తులు వివ‌రించారు.

Advertisements