ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు, మాజీ మంత్రి నారా లోకేష్ లేఖ రాసారు. ప్రస్తుతం రాష్ట్రమున్న పరిస్థితిలో, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు కోసం, మీరైనా జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో గవర్నర్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఈ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో దాదాపుగా 16.3లక్షల మంది పిల్లలు హాజరు అవుతారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత మంది బయటకు రావటం, మూర్ఖపు చర్య అని లోకేష్ అన్నారు. ప్రస్తుతం దేశంలో, 20 వరకు రాష్ట్రాలు పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయటం,రద్దు చేయటం చేసాయని గవర్నర్ కు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు నిర్వహిస్తే, వైరస్ మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని లోకేష్ అన్నారు. ఇంత మంది బయటకు వస్తే, వారికి సురక్షిత వాతావరణం కల్పించటం సాధ్యం అయ్యే పని కాదని లోకేష్ తెలిపారు. అలాగే గత కొన్ని రోజులుగా పరీక్షలు నిర్వహణ పై, తెలుగుదేశం పార్టీ తీసుకున్న ప్రజాభిప్రాయాన్ని కూడా గవర్నర్ ముందు లోకేష్ ఉంచారు. దాదాపుగా రెండు లక్షలకు పైగా విద్యార్ధులు కాని, వారి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఈ సమయంలో పరీక్షలు వద్దు అంటూ, తాము నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో, తమ అభిప్రాయాలు తెలిపి, ఈ ఉద్యమానికి మద్దతు పలికారని అన్నారు.

viswabhushan 26042021 2

ప్రభుత్వం ఈ పరీక్షలు పెడితే, వైరస్ ని అదుపు చేసే చర్యలు తీసుకోక పోవటమే కాకుండా, వైరస్ ని మరింతగా విస్తరించే అవకాసం ఉంటుందని లోకేష్ అన్నారు. మీకు విశేష అధికారులు ఉన్నాయని, ఆ అధికారాలు ఉపయోగించి, పరీక్షలు రద్దు చేసే విధంగా జోక్యం చేసుకోవాలని గవర్నర్ ని కోరారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ప్రజాభిప్రాయాలను, దాదాపుగా 1778 పేజీలను, ఈ లేఖకు లోకేష్ జతపరిచి, గవర్నర్ కు పంపించారు. మొత్తం మీద, 112466 ప్రజాభిప్రాయాలను లోకేష్ ఆ లేఖలో గవర్నర్ కు ఇచ్చారు. ప్రభుత్వం ఎలాగూ తమ వినతి పట్టించుకోవటం లేదని, మీకున్న అధికారులు ఉపయోగించి, పరీక్షలు రద్దు అయ్యేలా చూడాలని, ప్రభుత్వానికి సూచన చేయాలని, లోకేష్ ఆ లేఖలో తెలిపారు. ఇప్పటికే పరీక్షలు రద్దు విషయం పై, గత వారం రోజులుగా నారా లోకేష్ ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వానికి అన్ని వివరాలు ఇచ్చి, రద్దు చేయాలని కోరారు. పిల్లలు కూడా ఈ ఉద్యమంలో పాల్గున్నారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయం లేదు.

Advertisements