ఈ రోజు, జగన్ ను కలసి ఐదు కోట్ల విరాళం అందించారు మేఘా కృష్ణారెడ్డి. దేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థ మెఘా ఇంజనీరింగ్ కరోనా సాయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది అంటూ, చెప్పుకొచ్చారు. గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఐదు కోట్ల రూపాయల విరాళం అందించిన మెఘా ఇంజనీరింగ్ ఎండీ కృష్ణారెడ్డి..శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలసి సీఎం సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఇతర పారిశ్రామిక సంస్థలతో పోలిస్తే కరోనా పోరుకు విరాళం అందించిన వాటిలో మెఘా సాయం ప్రశంసనీయం. అయితే ఇక్కడ మరో విషయం ఉంది. గురువారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ ఎక్కడ వారు అక్కడే లాక్ డౌన్ ఉంది కాబట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి..ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో నానా కష్టాలు పడుతున్న ఏపీ యువత సరిహద్దులకు చేరుకుని ఇబ్బందులు పడుతోంది. ఇఫ్పటికీ కొన్ని చోట్ల యువత సరిహద్దుల వద్ద నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది మంత్రులు మాత్రం ఎవరైనా ఏపీకి చెందిన వారైనా రాష్ట్రంలోకి రావాలంటే మాత్రం 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని..అందుకు సిద్ధం అయితే మాత్రం రావాలని సూచించారు. అంతే కాదు..పదుల సంఖ్యలో విద్యార్ధులను క్వారంటైన్ లో పెట్టారు కూడా. ఏపీ సరిహద్దులకు చేరిన విద్యార్ధులు, ఉద్యోగులు మా రాష్ట్రంలోకి మమ్మల్ని రానివ్వరా? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ తరుణంలో అన్ని మార్గాలు బంద్ ఉన్న తరుణంలో మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి విజయవాడ వెళ్ళటం, జగన్ కు ఐదు కోట్ల రూపాయల చెక్కు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. అసలు మెగా కృష్ణారెడ్డి ఆకాశమార్గంలో విజయవాడ వెళ్ళారా?. రోడ్డు మార్గంలో వెళ్లారా?. ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారా? ఓ వైపు విద్యార్ధులను సరిహద్దుల్లో ఆపేసి విరాళం ఇస్తున్నారు కారణంతో బడా పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలోకి అనుమతించటం సరైన విధానం కాదని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిజంగా విరాళం ఇవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో కూడా ట్రాన్స్ ఫర్ చేయవచ్చని..ప్రజలకు ఓ రూల్..పారిశ్రామికవేత్తలకు ఓ రూల్ అనేది సరైన సందేశం పంపదని వ్యాఖ్యానించారు. కరోనా ప్రొటోకాల్ ప్రకారం మెఘా కృష్ణారెడ్డిని ఏపీలోకి అనుమతించటం నిబంధనల ఉల్లంఘనే అని చెబుతున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisements