తాడికొండ నియోజకవర్గ, వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎన్నిక వ్యవహారం వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే. ఆమె ఎస్సీ సామాజికవర్గం కాదని, ఆమె క్రిష్టియన్ అంటూ, వచ్చిన ఫిర్యాదు పై, ఇప్పుడు విచారణ ప్రారంభం అయ్యింది. ఆమె కులం పై ఫిర్యాదు రావటంతో, అసలు ఆమె ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారో కాదో, తేల్చాలి అంటూ, రాష్ట్ర ఎన్నికల ప్రాధానాదికారి, విచారణ చేయటానికి రంగంలోకి దిగారు. 2019 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి, వైసిపీ పార్టీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. ఆమె తెలుగుదేశం అభ్యర్ధి శ్రవణ్ కుమార్ పై పోటీ చేసి గెలుపొందారు. తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వడు నియోజకవర్గం. అయితే, ఉండవల్లి శ్రీదేవి ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో, తాను క్రిష్టియన్ అని చెప్పుకున్నారు. ఎస్సీ కులం వేరు, క్రిష్టియన్ వేరు కావటంతో, ఆమె ఎస్సీ అని చెప్పి, ఎన్నికల్లో పోటీ చేసారని, అందుకే ఆమెను అనర్హురాలుగా ప్రకటించాలని ఫిర్యాదు అందింది.

sridevi 19112019 2

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోష్ అనే వ్యక్తి , ఈ ఫిర్యాదు ఏకంగా భారత దేశ రాష్ట్రపతి, రాం నాద్ కోవింద్ వద్దకు పంపించారు. ఈ ఫిర్యాదుని సమీక్షించిన, రాష్ట్రపతి కార్యలయం, ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని, ఆమె ఎస్సీనో కాదో, విచారణ జరపాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఆ ఫిర్యాదు ఫార్వర్డ్ చేసారు. అదే విధంగా, రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఈ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసారు. రాష్ట్రపతి కార్యాలయం పంపించిన ఫిర్యాదు పై, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. పూర్తీ విచారణ జరిపి, వాస్తవాలు ఇవ్వాల్సిందిగా, ఎన్నికల కమిషన్, గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్‌ను ఆదేశించింది. విచారణ జరిపి, త్వరగా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు వెళ్ళాయి.

sridevi 19112019 3

ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ స్పందిస్తూ, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి, ఈ నెల 26న మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చారు. తాను ఎస్సీ అని నిరూపించే ఆధారాలు తీసుకు రావాలని, అన్ని పత్రాలతో, హాజరు కావాలని చెప్పారు. అలాగే తన తల్లిదండ్రులను వెంట తీసుకురావచ్చని పేర్కొన్నారు. అయితే ఈ విచారణ ఎటు దారి తీస్తుందో అనే టెన్షన్ వైసిపీ లో నెలకొంది. ఒక వేళ విచారణలో ఆమె ఎస్సీ కాదు అని తేలితే, ఆమెను అనర్హురాలిగా ప్రకటించి, సమీప అభ్యర్ధి అయిన శ్రవణ్ కుమార్ కు ఎమ్మెల్యే పదవి ఇస్తారో, లేక మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయో చూడాలి. ఏది ఏమైనా, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చే రిపోర్ట్ ని బట్టి, రాష్ట్రపతి కార్యాలయం దీని పై తన నిర్ణయం ప్రకటించే అవకాసం ఉంది.

Advertisements