ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని తెస్తున్నారని ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ద్వయంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ మేర‌కు శుక్ర‌వారం త‌న కార్యాల‌యం నుంచి ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అనేక ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా ప్రాంతాలలో బలంగా ఉన్నారని, వారిని బలహీన పరిచేందుకే జమిలి ఎన్నికల ఎత్తుగడను భాజపా వేస్తోందన్నారు. ఏ జాతీయ పార్టీకూడా సొంతబలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితిలో లేదని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో బలోపేతం కావడం రాజకీయంగా జాతీయ పార్టీలకు విఘాతంగా మారిందన్నారు.

modi 07072018 2

15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రమాదకరంగా పరిణమించాయని తెలిపారు. భాజపా నేతలే ఈ మార్గదర్శకాలను 15వ ఆర్థిక సంఘానికి సూచించారన్నారు. జీఎస్టీని కూడా రాష్ట్రాలను బలహీన పరిచేందుకే వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాయాలని చూస్తున్నారని వివరించారు. జీఎస్టీ, 15వ ఆర్థిక సంఘం, జమిలి ఎన్నికల వంటి ఆలోచనలన్నీ జాతీయ పార్టీల ఆధిపత్యం పెంచుకునేందుకే అని విమర్శించారు.

modi 07072018 3

రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడం, ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరచడమే అజెండాగా కేంద్రంలోని భాజపా నేతలు పెత్తందారీ పోకడల్లో వ్యవహరిస్తున్నారని యనమల అన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ్‌బంగలోని మమతా బెనర్జీ, దిల్లీలో కేజ్రీవాల్, బిహార్‌లో నితీశ్‌కుమర్‌, లాలూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పట్ల ఆ పార్టీ ఏవిధంగా వ్యవహరిస్తోందో దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. నరేంద్రమోదీ తరహాలో గతంలో ఎవరూ ఇలా రాజకీయ కుట్రలు చేయలేదన్నారు. మోదీ, షా ద్వయం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Advertisements