కియా విషయం రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే కియా ఎక్కడికీ వెళ్ళటం లేదు అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి ముగిసినట్టే. అయితే, ఈ సందర్భంలో, వైసీపీ నేతలు, కియా పై పెట్టిన వరుస ప్రెస్ మీట్లు, కియా మీద కురిపించిన ప్రేమ విషయం మాత్రం, అందరినీ ఆశ్చర్య పరిచింది అనే చెప్పాలి. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి అంటారు. అలా నిలకడ మీద, వీళ్ళకు నిజాలు తెలిసాయో ఏమో కాని, ఒకప్పుడు కియా అంటే మండి పడిన వైసీపీ నేతలు, ఈ రోజు కియా మీద మాట పడనివ్వటం లేదు. ఇది నిజంగా శుభ సూచికమే. ఇప్పటికైనా చంద్రబాబు కృషిని వీరు గుర్తించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా కియా మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు. టైం మారే కొద్దీ, హోదాలు మారే కొద్దీ మనుషుల్లో వచ్చిన మార్పుగా దీన్ని భావించాలేమో. కియా మోటార్స్ కంపెనీని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, కరువు జిల్లా అయినా అనంతపురం జిల్లాకు, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తీసుకు వచ్చారు.

తెలంగాణా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి హేమాహేమీ రాష్ట్రాలు పోటీ పడినా, చంద్రబాబు కియా మోటార్స్ ని ఒప్పించి, ఆ రాష్ట్రాల కంటే, మీకు మెరుగైన రాయతీలు ఇస్తాం అని చెప్పి, తీసుకువచ్చారు. కియాతో పాటుగా, 17 కియా అనుబంధ సంస్థలు రావాల్సి ఉండగా, అవి గత కొన్ని రోజుల క్రితం తమిళనాడు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే కియా వచ్చిన సందర్భంలో, వైసీపీ పార్టీ నేతలు, కియా పై, చంద్రబాబు పై విమర్శలు చేస్తూనే వచ్చారు. విజయసాయి రెడ్డి అయితే, కియా ప్లాంట్ ఎక్కడో దేశంలో ఎత్తేసారు, అలాంటి ప్లాంట్ ఇక్కడా అంటూ ట్వీట్ చేసారు. కియా ముందు వైసీపీ పార్టీ వాళ్ళు వెళ్లి ధర్నాలు కూడా చేసారు. ఇక కియా పై సాక్షిలో రాతలు అయితే చెప్పనవసరం లేదు.

అయితే, ఇప్పుడు వాళ్ళు విపక్షం నుంచి అధికార పక్షంలోకి రావటం, అదీ కియా వెళ్ళిపోతుంది అంటూ విమర్శలు రావటంతో, డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో వైసీపీ పడింది. ఈ క్రమంలోనే, వైసీపీ పార్టీ నేతలు, కియా గొప్పదనం గురించి వివరించారు. బుగ్గన అయితే, కియా 14 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది, దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి అని చెప్పారు. ఇక ఎంపీ మాధవ్, ఎమ్మల్యే శ్రీకాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇలా అందరూ, కియా గురించి గొప్పగా చెప్పారు. ఇది అభినందించ దగ్గ విషయమే అయినా, గతంలో చంద్రబాబు ఏమి తెచ్చాడు అన్న నోటితోనే, ఈ రోజు 14 వేల కోట్లు ఒకే కంపెనీ పెట్టుబడి తెచ్చాడు అంటూ కియా గొప్ప చెప్తున్నారు అంటే, వైసీపీ ఇలా మాట్లాడి, సెల్ఫ్ గోల్ వేసుకుందా ? అనే అభిప్రాయం కలుగుతుంది. రేపు చంద్రబాబు ఏమి తెచ్చాడు అంటే, కియా పై, వైసీపీ నేతలు గొప్పగా మాట్లాడిన మాటలు చూస్తేనే అర్ధం అయిపోతుంది.

Advertisements