ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేయాలని జీవో నెం.623ని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వైసీపీ రంగులతో పాటు మరో రంగును వేయాలని ప్రభుత్వం జీవో తెచ్చింది. అయితే ఈ రంగులు కూడా మూడు వైసీపీ రంగులు, ఒకటి కింద మట్టి రంగు ఉన్నాయి. దీంతో, మళ్ళీ, పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని సవాల్ చేసారు. ఈ పిటీషన్ పై, హైకోర్ట్ ఈ రోజు విచారణ జరిపింది. దాఖలపైన పిటిషన్‍ను విచారించిణకు స్వీకరించిన హైకోర్టు, జీవో నెం.623ను సస్పెండ్ చేసింది. దీని పై కౌంటర్ వెయ్యాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం, ఇలా పదే పదే కోర్ట్ ఆదేశాలు ధిక్కరించటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇది వరుకే, ఈ రంగుల విషయం పై, హైకోర్ట్ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. తరువాత ప్రభుత్వం, హైకోర్ట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. అక్కడ సుప్రీం కోర్ట్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు, కాషాయం రంగు వేసి, మోడీ ఫోటో పెడితే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నించింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా తాత్సారం చెయ్యటంతో, హైకోర్ట్ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్ట్ కొట్టేసిన తరువాత కూడా, ఇంకా ఎందుకు పని మొదలు పెట్టలేదు, లాక్ డౌన్ ముగిసిన మూడు వారాల్లో, రంగులు మార్చాలని ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపటానికి వీలు లేదని చెప్పింది. కొత్తగా ఏ రంగులు వెయ్యాలో, నిర్ణయం తీసుకోవాలని, చీఫ్ సెక్రటరీని కోరింది. అయితే, ఇంత జరిగిన తరువాత కూడా, ప్రభుత్వం, మళ్ళీ అవే రంగులతో కొత్తగా ఆదేశాలు ఇచ్చింది. పోయిన నెలలో, కొత్త రంగులతో, మార్గదర్శకాలు జారీ చేస్తూ, జీవో, 623 విడుదల చేసింది.

దాని ప్రకారం, వైసీపీ రంగులు, తెలుపు, నీలం, ఆకుపచ్చతో పాటుగా, కొత్తగా మట్టి రంగు వేసారు. దానికి అర్ధాలు కూడా చెప్పారు. పాడి పంటలకు ఆకుపచ్చ రంగు అని, నీలి విప్లవానికి, నీలు రంగు అని, అలాగే పాల విప్లవానికి, తెలుపు రంగు అని, మట్టిని పోల్చుతూ, మట్టి రంగు అని చెప్పింది. అన్ని భవనాలకు ఈ రంగులు వెయ్యాలని, కింద మాత్రం, మట్టి రంగు వెయ్యాలని చెప్పింది. అయితే, పైన మూడు రంగులు మాత్రం, వైసీపీ రంగులే. సాంకేతికంగా, కింద ఎక్కడో ఒక మూల ఇంకో రంగు వేసి, కోర్ట్ దగ్గర తప్పించుకోవాలని చూసింది. అయితే, ఈ రోజు ఈ కొత్త జీవో కూడా విచారణకు రావటంతో, మళ్ళీ పార్టీ రంగులే వేస్తున్నందుకు, హైకోర్ట్ వెంటనే ,ఆ జీవో సస్పెండ్ చేస్తూ, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని కోరింది.

Advertisements