ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో ద‌ళిత యువ‌త‌కు స‌బ్సిడీపై 222 క్యాబ్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణి చేశారు. అమరావతి సచివాలయంలోని త‌న‌ కార్యాలయం వద్ద దళిత యువతకు ఉపాధి కల్పనలో భాగంగా వాహనాల పంపిణీని సీఎం ప్రారంభించారు. ఈసందర్భంగా రూ.20లక్షల విలువ చేసి ఇన్నోవా క్రిష్ట ను రూ.16లక్షలకే ప్రభుత్వం ఇప్పిస్తుందని చంద్రబాబు తెలిపారు. రూ.16 లక్షల్లోనూ రూ. 7లక్షల సబ్సిడీని ప్రభుత్వం భరించనుంద‌న్నారు. రూ. 30 కోట్ల పెట్టుబడితో ఈ వాహనాలను పంపిణి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఎప్పటికప్పుడు డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఈ యువతను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో వాహనం ద్వారా నెల‌కు రూ. 12 వేలు నుంచి రూ.22 వేలు వరకు ఆదాయం లభిస్తుందన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఈ ఏడాది చివరిలోనే 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఏపీ షెడ్యూల్‌ కులాల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌, ముఖ్యకార్యదర్శి రావత్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisements