దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ కృష్ణా రీజియన్ లింక్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తోంది. మీరుంటున్న ప్రాంతం నుంచే నేరుగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ విజయవాడ బస్స్టేషన్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా దూరప్రాంత బస్సులు ఎక్కి గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. లింక్ టిక్కెట్ తీసుకునే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరు పతి, అనంతపురం, కడప, విశాఖపట్టణం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ చేరుకోవడానికి కొంతమేర ఇబ్బందులు పడుతున్న దృష్యా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు.

లింక్ టికెట్ల విధానం...
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా బస్టాండ్ రావల్సి ఉంటోంది. ఈ మేరకు నగరం నలువైపలా ఉన్న ప్రాంతాల్లో లింక్ అవకాశాన్ని కల్పించేందుకు కొన్ని సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఎంపిక చేశారు. గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, తాడిగడప, పోరంకి, చోడవరం, పెద్దపులిపాక, కంకిపాడు, తోట్లవలూరు, ఉయ్యూరు, శ్రీకాకుళం, సింగ్ నగర్, నున్న, ఆగిరిపల్లి, అడవినెక్కలం, గన్నవరం ఎంపిక చేశారు. ఆయా గ్రామాల నుంచి బస్టాండ్ చేరుకోవడానికి, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు టికెటు తీసుకునే సమయంలోనే లింక్ టిక్కెట్లు తీసుకునే అవకాశం కల్పించారు.
దూరప్రాంతాల టికెటు ధరతో 35 కిలోమీటర్ల దూరానికి రూ.15 ధరతో లింక్ టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ కౌంటర్లోనే కాకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకునే సమయంలో పైన నిర్దేశించిన ప్రాంతాల నుంచి చేరాల్సిన ప్రాంతాలను తెలిపితే లింక్ కలుపుతూ టికెట్ వచ్చే అవకాశం కల్పించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ కుండా లింక్ విధానంలో దూరప్రాంతాలకు వెళ్లవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

పైన తెలిపిన గ్రామాలకు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి 145 సర్వీసులకు లింక్న ప్రవేశపెట్టగా, ఉయ్యూరు బస్టాండ్ నుంచి 22 సర్వీసులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

లింక్ ప్రయాణికులకు బస్టాండ్ లో సదుపాయం:
దూరప్రాంతాల లింక్ టిక్కెట్లు పొందిన ప్రయాణికులకు పండిట్ నెహ్రూ బస్టాండ్ లో సదుపాయాలు కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు.

Advertisements