భవానీ ఐలాండ్ సరికొత్త హంగులను సంతరించుకోనుంది.... భవానీ ఐలాండ్ ఇమేజ్ మరింగ పెంచేందుకు రంగం సిద్ధమైంది... అమరావతి రాజధానికి ఆభరణం లాంటి భవానీ ఐలాండ్ సమగ్ర అభివృద్దికి తొలి అడుగు పడింది. ద్వీపాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్(బి. ఐ.టి.సి)కు తొలి విడతగా రూ.6 కోట్ల నిధులను సర్కారు గురువారం విడుదల చేసూ జీవో జారీ చేసింది. ఈ నిధులతో భవానీద్వీపంలో మల్టీమీడియా లేజర్ షో, దీనికి అనుబంధంగా మ్యూజికల్ డాన్సింగ్ ఫాంటైన్స్ వాటర్ స్కీన్లు ఏర్పాటు చేయనున్నారు.

దేశంలోనే మరెక్కడా లేనంత అద్భుత ద్వీపం.. భవానీ ఐలాండ్ 132 ఎకరాల్లో స్వచ్చమైన కృష్ణా మంచినీటి జలాల మధ్యలో ఏర్పడిన ప్రకృతి ప్రసాదితం. దీనిలో 15 ఎకరాలు అభివృద్ధి చేసి ప్రస్తుతం పర్యటకుల కోసం అందుబా టులో ఉంచారు. అయితే. ఈ 15 ఎకరాల్లోనూ పర్యాటకుల కోసం చేసిన ఏర్పాట్ల నామమాత్రమే. దీంతో వెళ్లినవాళ్లు వెళ్లినట్టే వెనక్కి వచ్చేస్తున్నారు. అందుకే, భవానీ ద్వీపాన్ని పూర్తి స్తాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన బృహత్తర ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు. ప్రత్యేకంగా బీఐటీసీని ఏర్పాటు చేసింది. తొలిదశలో భాగంగా అత్యాధునిక లేజర్ షోను ఏర్పాటు చేయనున్నారు. విదేశాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న మల్టీమీడియా లేజర్ షో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మల్లీమీడియా లేజర్ షో అన్నది ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఇందులో విజువలైజేషన్ కూడా ఉంటుంది. ఇక మ్యూజికల్ డాన్సింగ్ పౌంటెయిన్ అన్నది ప్రత్యేకమైనది. ఒక వేదిక మీద సంగీత కచేరీ జరుగుతుంటే దానికి అనుగుణంగా చుట్టూ ఉన్న పౌంటెయిన్స్ నృత్యాలు చేస్తుంటాయి. విద్యుత్ లైటింగ్ నడుమ దేదీప్య మానంగా వెలిగిపోతుంటుంది. అటు మల్లీమీడియా లేజర్ షోను, ఇటు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పౌంటెయిన్ను అనుసంధానం చేసారు. దీనివల్ల సంగీతానికి అనుగుణంగా పౌంటెయిన్లు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది.

హైదరాబాద్ గోల్గొండ కోటలో ఏర్పాటు చేసిన లేజర్ షో ఇలాంటిదే. అయితే. ఇక్కడ కృష్ణా జలాలు సైతం అదనపు ఆకర్షణ కావడంతో. లేజర్ షోకు అనుబంధంగా మ్యూజికల్ పౌంటైన్లు, వాటర్ స్క్రీన్, సైతం ఏర్పాటు చేయనున్నారు. అద్భుతమైన వెలుగు కిరణాల విన్యాసాల మధ్య, చెవులకు ఇంపుగా ఉండే సంగీతానికి తగ్గట్టుగా, నీరు గాలిలోనికి లేచి, నాట్యం చేస్తున్నట్టుగా ఉండే. ఈ దృశ్యాలు అత్యద్బుతంగా ఉంటాయి.

ప్రస్తుతం భవానీ ద్వీపంలో ఎలాంటి ఆకట్టే అంశాలు లేకపోవడంతో నిత్యం 500 మంది లోపే వస్తున్నారు. ఆదివారాలు, సెలవుదినాల్లో ఎక్కువ మంది ఉంటారు. నెలకు 15 వేల లోపు, ఏటా రెండు లక్షల మంది వరకూ వస్తున్నారు. వీరంతా కేవలం పడవ ప్రయాణం పై ఆసక్తితోనే వస్తున్నారు.

Advertisements