పెద్ద పెద్ద కారుల్లో, సెక్యూరిటీ నడుమ ప్రయాణించే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, ఆర్టీసీ సిటీ బస్ లో ప్రయాణం చేసి ఆశ్చర్యపరిచారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునే క్రమంలో 53వ డివిజన్ రామకృష్ణాపురం బుడమేరు వంతెన పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, బుడమేరు వంతెన బస్ స్టాప్ లో ప్రయాణికులతో ముచ్చటించారు.

ఈ లోపుగా నగరం నుంచి పాయకాపురం వెళ్తున్న 48వ నెంబర్ సిటీ బస్ రాగానే, బస్ ఎక్కి ప్రయాణికులతో కొద్దిసేపు చిట్ చాట్ చేశారు. బస్ ప్రయాణంలో కండక్టర్ తో ముచ్చటించిన ఉమ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులు, ఉద్యోగ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

అలాగే బస్సులోని ప్రయాణికులందరినీ కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులతో సెల్పీలు దిగారు. ఎమ్మెల్యే ఉమ పైపుల రోడ్డు బస్సు స్టాప్ లో దిగిపోయారు. అయితే సాధారణ ప్రయాణికునిగా సిటీ బస్ ఎక్కిన ఉమ ఆర్టీసీ సంస్థ ఎమ్మెల్యేలకు కల్పించిన ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కాదని ఆయనతో పాటు ఆయనతో ఎక్కిన అనుచరగణానికి సైతం టికెట్లు తీసుకోవడం గమనార్హం.

Advertisements