విజయవాడ నగరానికి నూతన శోభ రానున్నది. ప్రధాన రహదారులు మెరిసిపోయేలా కార్పొరేషన్ ఆధ్వర్యంలో విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. రామవరప్పాడు నుంచి సిద్దార్ధ మెడికల్ కళాశాల వరకుగల వాకింగ్ ట్రాకుల్లో పైలెట్ ప్రాజెక్టుగా కార్పొరేషన్ అధికారులు విద్యుద్దీపాలు నిన్న రాత్రి ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాల అలంకరణ ఎలా ఉంది, ఇంకా మెరుగుపడటానికి ఏమి చెయ్యాలి అనేది, ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా తెలుసుకున్నారు.
నగర ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాలంకరణను ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ(సీఆర్డీఏ) నిర్ణయించి. ఆ బాధ్యతలను నగర కార్పొరేషన్ కు అప్పగించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి పవిత్ర సంగమం వరకు విద్యుద్దీపాలను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనలో భాగంగా రామవరప్పాడు నుంచి సిద్దార్ధ మెడికల్ కళాశాల వరకు రోడ్లకు ఇరువైపులా వాకింగ్ ట్రాకుల్లోని చెట్ల కింద ఫోకస్ లైట్లను ఏర్పాటుచేశారు.
నెలన్నర క్రితం ఇలాంటి ట్రయల్ను ఏర్పాటుచేసిన అధికారులు మరోమారు గ్రీనరీలోని చెట్ల వద్ద ఈ ఏర్చాటు చేశారు. ఈ ట్రయల్లో ఎదురయ్యే సమస్యలను గమనించి మరుసటి ప్రతిపాదనను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
నగర ప్రధాన రహదారులలో ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరప్పాడు, రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ వరకు, బెంజిసర్కిల్ నుంచి పోలీసు కంట్రోల్ రూం వరకు, బెంజిసర్కిల్ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు, పోలీసు కంట్రోల్ రూం నుంచి పవిత్ర సంగమం వరకు ఇదే తరహాలో రోడ్లకు ఇరువైపులా విద్యుద్దీపాలను ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది.