ప్రతిష్టాత్మక అమరావతి–అనంతపురం రహదారి ప్రాజెక్ట్ అలైన్మెంట్ను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ హైవేపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ నిర్మిస్తున్న రహదారులు నిర్దిష్ట కాలపరిమిలో పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రహదారుల పనులకు సంబంధించిన అన్ని అంశాలపై కూలంకుశంగా చర్చించారు. సమావేశంలో ఎన్హెచ్ఏఐ నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతపురము నుంచి అమరావతి వరకూ నేరుగా ఎక్స్ప్రెస్ వే నిర్మించ తలపెట్టామని, ఇది దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించి, వారం రోజుల్లో అలైన్మెంట్ను ఖరారు చేయాలన్నారు. భూ సేకరణ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ రహదారి పక్కనే రైల్వే లైన్ కూడా ఉంటుందని అన్నారు. వీటన్నింటి సత్వర అనుమతుల కోసం సంబంధిత అధికారులకు, కేంద్ర మంత్రులకు లేఖలు రాయాలని తన అదనపు కార్యదర్శి రాజమౌళిని ఆదేశించారు.
ఎక్స్ప్రెస్ వే నిర్మాణ ప్రక్రియను త్వరతిగతిన పూర్తిచేయడం కోసం ఐదు జిల్లాలలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేయాలని సీయం చెప్పారు. ఈ రహదారి వెంబడి ట్రాన్సిట్ డెవలెప్మెంట్ జరగాలని, అందుకు అధ్యయనం చేపట్టాలని ఆదేశించారు. ఈ రహదారి వెంబడి పారిశ్రామిక పట్టణ సముదాయాలు వస్తాయని తెలిపారు. రెండేళ్లలో ఈ రహదారిని పూర్తిచేయాలని చెప్పారు.
రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ చేపట్టిన రహదారి నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దిష్ట కాల పరిమితిలోపు పూర్తి కావాలని సీయం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రాయపూర్ నుంచి విశాఖ–భావనపాడు వరకు నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారిని ఎక్కువ మలుపులు తిప్పి దూరం పెంచకుండా వంపులు లేని సుందర రహదారిగా ఉండేలా చూడాలన్నారు.
ఈ సమీక్షలో రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా, ఏపీయస్ ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య సీయం అదనపు కార్యదర్శి అడుసుమల్లి రాజమౌళి పాల్గొన్నారు.