వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో, ఏపీ అసెంబ్లీ నూతన భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ శాసనమండలి భవనాల నిర్మాణ పనులు చేపట్టిన ఎల్ అండ్ టి సంస్థ అధికారికంగా ప్రభుత్వానికి అప్పగించనుంది.
అత్యాధునికి టెక్నాలజీతో నిర్మించిన ఈ కొత్త అసెంబ్లీ భవనంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు అనువైందిగా రూపొందించారు. ఏయే ప్రాంతాల్లో ఎవరెవరు సంచరిస్తున్నారనే విషయాన్ని డేగకన్నులా పర్యవేక్షించేందుకు వీలుగా హైపవర్, నైట్ విజన్ సిసి కెమెరాలతో భద్రతా ఏర్పాటు చేశారు.
విశాలమైన సీటింగ్ పద్దతిని రూపొందించడంతో సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త భవనాన్ని నిర్మించారు. మార్చి 1 నుంచి ఇక్కడ రాష్ట్ర 2017-18 వార్షిక బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సమావేశాలకు సంబంధించిన తేదీలు, బడ్జెట్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఫైలును ఆమోదించి ఆర్థిక మంత్రి యనమల ఆమోదానికి పంపినట్లు సిఎస్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సిఎస్ ఆమోదం తెలిపిన ఫైలులో అసెంబ్లీ సమావేశాలను మార్చి 1వ తేదీన గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహసన్ ప్రసంగంతో ప్రారంభించనున్నారు. మార్చి 6వ తేదీన 2017-18 వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
వూర్చి 27న సమవేశాలను ముగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఆమోదించారని తెలిసింది. అయితే టక్కర్ పంపిన ఫైలును ఆర్థికశాఖమంత్రి యనమల మరోసారి పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారుచేసే వీలుంది. ఆ తరువాత గవర్నర్ నరసింహన్ ఆమోదానికి ఫైలు పంపాల్సి ఉంటుంది.
మరోవైపు వెలగపూడిలోని సచివాలయంలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ, శాసనమండలి పనులను రెండు పర్యాయాలు పరిశీలించిన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నిర్మాణ సంస్థకు, భద్రతా సిబ్బందికి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారు లకు పలు సూచలనలు చేశారు. అలాగే శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ ఎప్పటికప్పుడు అసెంబ్లీ భవన నిర్మాణ పనుల పై ప్రతి రెండు రోజులకో సారి సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ పనులను ఎల్ అండ్ టి సంస్థ అనుకున్న సమయానికే పూర్తిచేసింది. అధునాతన టెక్నాలజీతో కూడిన అసెంబ్లీ శాసనమండలి సరి కొత్త అనుభూతి కల్పించనుందని స్పీకర్ అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కార్యాలయాలతో పాటు, మంత్రుల పేషీలకు సరికొత్త హంగులు దిద్దుతున్నారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలతో అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అసెంబ్లీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించిన తరువాత మరో సారి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించే అవకాశాలున్నట్లు స్పీకర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.