వెలగపూడి సచివాలయ ఆవరణలో నిర్మిస్తున్న నూతన శాసనసభ, శాసనమండలి భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే స్లాబ్ పనులతోపాటు దాదాపుగా ఇంటీరియర్, ఇతర పనులన్ని పూర్తి కావచ్చాయి. మూడు షిఫ్ట్ లలో కార్మికులు పనిచేస్తున్నారు. శాసనసభ సభాపతి పోడియంతోపాటు, మండలి పోడియంలు పూర్తి అయ్యాయి.
మండలి, శాసనసభ సమావేశ మందిరంలో సీటింగ్ పనులు పూర్తి కావస్తున్నాయి. విద్యుద్దీకరణ పనులతోపాటు ఇంటీరియల్ డెకరేషన్ పనులు కొనసాగుతున్నాయి. శాసనసభలో సభ్యుల కోసం ఆకుపచ్చ రంగు సీట్లు, శాసనమండలిలో ఎరుపు రంగు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుమారు ఐదు ఎకరాలలో పార్కింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండు, మూడు రోజుల కోసారి స్వయంగా పరిశీలిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
అయితే ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో, కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవానికి, ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించటానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ, ఫిబ్రవరి 10 నుంచి మొదలుకానున్న, జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గునటానికి, విజయవాడ వస్తున్న నేపధ్యంలో, అదే రోజు, ప్రధాని చేతుల మీదుగా, నూతన అసెంబ్లీ ప్రరంభిపచేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 3వ వారంలోనే బడ్జెట్ సమావేశాలు?
తొలుత ఫిబ్రవరి మొదటి వారంలో శీతకాల సమావేశాలు నిర్వహించి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావించారు. అయితే అసెంబ్లీ మండలి భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి మూడో వారంలో ఏకంగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.