దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళామణులకు స్వాగతం పలికేందుకు కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమస్థలి ముస్తాబవుతోంది. జాతీయ మహిళా సదస్సు నిర్వహణ, ప్రచార సరళి పై రాష్ట్ర శాసనసభ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా సదస్సు నిర్వహణ విషయంలో తొలి నుంచి అమరావతి డిక్లరేషన్ ద్వారా ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళుతున్నారు.
పవిత్ర సంగమంలో ఫిబ్రవరి 10 నుండి 12 వరకు జరిగే జాతీయ మహిళా సదస్సు ప్రాంగణం పనులు చురుకుగా కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సు ప్రధాన ప్రాంగణం పనులను ఆధికార యంత్రాంగం ఆహర్నిశలు శ్రమిస్తూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు. ప్రధాన ప్రాంగణంలో వి.ఐ.పి లాంజ్, మీడియా లాంజ్, అతిధులకు అవసరమైన సకల ఏర్పాట్లను పూర్తి చేయిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి విచ్చేసే అతిధులకు, ఆహ్వనితులకు సీటింగ్, భోజన వసతి, సదస్సు నిర్వహణ, లైవ్ టెలికాఫ్ట్, పాత్రికేయులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా, పండిట్ రవిశంకర్, లోక్సభ సభాపతి సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులతో పాటు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు 150 మంది, 20-25 మంది విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. దేశం నలుమూలల నుంచి వివిధ కళాశాలల విద్యార్థినులు 10-12 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. మహిళా ఎంపీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా శాసనసభ్యులు, స్పీకర్లు, మన రాష్ట్రంలోని స్థానిక సంస్థల మహిళా ప్రతినిధులు హాజరవుతున్నారు.
ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ హాల్ అనుబంధంగా మీడియా కాన్ఫరెన్స్ హాల్, వాహానాల పార్కింగ్ ఏర్పాటు, హెలిపాడ్ , పారిశుద్ధ్య ఏర్పాట్లను, ప్రాంగణం అలంకరణ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం కూడలి నుంచి పవిత్రసంగమ ప్రాంతానికి చేరుకునే మార్గాన్ని హరితహారంలా తీర్చిదిద్దారు. నదీ తీరం, సభాప్రాంగణాలను పూలమొక్కలతో అలంకరించారు.