పట్టిసీమ ఎత్తిపోతల పథాకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అంతేవేగంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును సాకారం చేస్తోంది. ఈ ఆగస్టు 15న పురుషోత్తపట్నం ప్రాజెక్టును ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు సాగు-తాగు నీరు అందించడమే తమ ప్రథమ కర్తవ్యం కావాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రాధామ్య ప్రాజెక్టుల నిర్మాణంపై జిల్లాలవారీగా అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గుండ్లకమ్మ కాలువల నిర్మాణం పూర్తయి, నీటి విడుదలకు సిద్ధంగా వుండటంపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గుండ్లకమ్మ నుంచి సంగం బ్యారేజ్ వరకు నీటిని తీసుకువెళ్లి పెన్నాతో అనుసంధానించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పూల సుబ్బయ్య వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు వేగవంతం చేసేందుకు డిజైన్లు త్వరితగతిన ఆమోదం పొందేలా చూడాలని అన్నారు. చంపావతి, నాగావళి, వంశధార అనుసంధానం ఎంతవేగంగా పూర్తి చేయగలిగితే ఉత్తరాంధ్రకు అంత ప్రయోజనకరమని చెప్పారు.

హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1లో భాగంగా ప్రధాన కాలువ విస్తరణ పనులు వర్షాకాలం ప్రారంభం నాటికి పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 కింద నాగసముద్రం, పుట్టపర్తి దగ్గర ప్రధాన కాలువ కోసం నిర్మిస్తున్న రైల్వే వంతెనలను ఈ నెలాఖరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని చెప్పారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అయితే, రాయలసీమకు శ్రీశైలం-ముచ్చుమర్రి ప్రాజెక్టులు జీవనాడిగా నిలుస్తాయని, వీటిని సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.

ప్రమాదరహిత ప్రాంతంగా పోలవరం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులకు సూచించారు. పోలవరం నిర్మాణ ప్రాంతం నుంచి పనులు జరుగుతున్న తీరును చీఫ్ ఇంజినీర్ రమేష్ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం విధుల్లో 3,386 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పాల్గొంటున్నారని చీఫ్ ఇంజినీర్ తెలుపగా, పోలవరం పనుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి భద్రత ఎంతో ముఖ్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశీలించారు.

తవ్వకం పనులు నిర్దేశిత సమయానికి పూర్తికాకపోవడంపై నిర్మాణ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి ప్రశ్నించగా, యంత్రపరికరాల తరలింపు, వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాకాలం వచ్చేలోగా తవ్వకం పనుల లక్ష్యాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేస్తున్నామని అధికారులు వివరించారు. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం మాత్రం నిర్దేశిత సమయానికి పూర్తయ్యేలా, ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూస్తున్నామని తెలియజేశారు.

ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 23 వరకు స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు 14,452 క్యూబిక్ మీటర్ల వరకు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా 5,512 క్యూబిక్ మీటర్ల మేర పనులు జరిగాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మరో 26.8 మీటర్లు పూర్తయ్యింది. గతవారం స్పిల్ చానల్‌కు సంబంధించి 6.26 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తికాగా, లెఫ్ట్ ఫ్లాంక్ 29 వేల క్యూబిక్ మీటర్లు, అప్రోచ్ చానల్ 54 వేల క్యూబిక్ మీటర్లు, పైలెట్ చానల్ 49 వేల క్యూబిక్ మీటర్ల వరకు పనులు జరిగాయి. మొత్తంమ్మీద ఏప్రిల్ 24 నాటికి స్పిల్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్ తవ్వకం పనులు ఇంకా 37.11% మిగిలివున్నాయి.

సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరావు, ట్రాన్స్‌ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read