విజయవాడలో ఓ యువకునికి కరోనా పాజిటివ్​గా ఉన్నట్లు కలెక్టర్​ ఇంతియాజ్​ అహ్మద్​ తెలిపారు. అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. యువకుని ఇంటి చుట్టుపక్కల సర్వే చేసినట్లు పేర్కొన్నారు. స్థానికులకు వైరస్​ సోకకుండా అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో విదేశాల నుంచి వచ్చిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్​ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు కలెక్టర్ ఇంతియాజ్​ అహ్మద్​ ప్రకటన చేశారు. ఈనెల 17, 18న హోమ్​ ఐసోలేషన్​లో ఉన్న యువకుడు.. జ్వరం రావడం వల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కలెక్టర్​ తెలిపారు. నమూనాలను పరీక్షలకు పంపగా.. కరోనా ఉన్నట్లు తేలిందని చెప్పారు. యువకుని ఇంటి చుట్టుపక్కల 500 ఇళ్లల్లో సర్వే చేసినట్లు పేర్కొన్నారు. స్థానికులకు వైరస్​ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ 3 రోజుల్లో యువకుడు, అతని కుటుంబ సభ్యులు ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. యువకుడు హైదరాబాద్​ నుంచి వచ్చిన క్యాబ్​ గురించి కూడా ఆరా తీస్తున్నామని అన్నారు.

కరోనాపై ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే కంట్రోల్​ రూం నెంబర్​ 79952 44260కు సమాచారం ఇవ్వాలని సూచించారు. విజయవాడలో యువకునికి కరోనా పాజిటివ్​గా తేలిన నేపథ్యంలో ఏప్రిల్​ 14 వరకు 144 సెక్షన్​ అమలు చేయనున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రేపటి నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. జనతా కర్ఫ్యూను మూడు రోజులు అమలు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పారిస్​ నుంచి వచ్చిన యువకునికి కరోనా వచ్చిందన్న ఆయన.. కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నామని చెబుతున్నా వారికి పరీక్షలు అవసరమని అన్నారు. మనకు మనం స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలని సీపీ తెలిపారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నివారణకు అందరూ సహకరించాలని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించాలని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువగా వైరస్​ లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisements