ఆంధ్రప్రదేశ్ లో ఇక తాగునీటి సమస్యకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే పరిష్కారం దొరుకుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్ వినూత్నంగా రూపొందించిన 'జలవాణి' కార్యక్రమం పేరిట టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1899 తో ఒక కాల్ సెంటర్ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నా ఈ ఫోన్ నెంబరుకు పిర్యాదు చేస్తే చాలు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతుంది. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీ, ఏఎంఎస్ అలర్ట్ మేనేజ్మెంట్, జీపీఎస్ టెక్నాలజీ ఉపయోగించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ రూపొందించారు.
ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘కాల్ సెంటర్’ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.
ఈ పథకంలో రియల్టైమ్ అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నా.. కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరించనున్నారు. తాగునీటి సమస్యపై ఇప్పటికే 3000 ఫిర్యాదులు వచ్చాయని వాటిలో 30% పరిష్కారమైనట్లు మంత్రి వివరించారు. ఉద్దానంలో మూడు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, జూలైలోగా మరో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని కిడ్నీ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.