ఒకే రోజు కోటి మొక్కలు నాటే మహా యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జూలై ఒకటిన రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు ‘వనం-మనం’ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జూలై ఒకటో తేదీన గుంటూరు జిల్లా కొండవీడు నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమం కార్తీక మాసంలో నిర్వహించే ‘వనమహోత్సవం’ వరకూ నిరాటంకంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యేలా చూడాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని శ్రీ చంద్రబాబు అన్నారు. జిల్లాలవారీగా మొక్కల నాటే బాధ్యతను మంత్రులతో పాటు ప్రతిఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. కోటి మొక్కల సంకల్పానికి అన్ని రకాల మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అందరినీ సంసిద్ధులు చేయాలని చెప్పారు.

గురువారంఉండవల్లిలోని తన నివాసంలో అటవీ, పర్యావరణ శాఖ, వైల్డ్‌లైఫ్ బోర్డ్‌పై మంత్రి సిద్దా రాఘవరావుతో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 23 శాతంగా వున్న అటవీ విస్తీర్ణాన్ని 2029 నాటికి 50 శాతానికి విస్తరించేలా చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేలా అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు. హరితాంధ్రప్రదేశ్ సాకారానికి అవసరమైన నిధుల సమీకరణపైనా దృష్టి పెట్టాల్సిందిగా అధికారులతో అన్నారు. నరేగా నిధులను భారీఎత్తున వినియోగించుకోవచ్చని సూచించారు. రైల్వే లైన్లకు, రహదారులకు ఇరువైపులా చెట్లు పెంచాలన్నారు.

‘అటవీప్రాంతంలో పడ్డ ఒక్క చుక్క వర్షం నీరు కూడా వృధా కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అటవీప్రాంతం చుట్టూ కందకాలు తవ్వాలని చెప్పారు. చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్ డ్యాంలు పెద్దఎత్తున నిర్మించాలని సూచించారు. అటవీ ప్రాంతంలో నీరు నిల్వ ఉండేలా చూస్తే అడవులు, వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.

ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయడం ద్వారా పచ్చదనాన్ని గణించేఅవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. మొక్కలు పెద్దసంఖ్యలో నాటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని ప్రకృతికి దగ్గర చేయడమే ఆశయంగా వుండాలని చెప్పారు. ట్రీ బ్యాంక్ ఏర్పాటు చేసి మొక్కలను డోర్ డెలివరి చేసేలా వ్యవస్థ రూపొందించే వినూత్న ఆలోచనలతో పచ్చదనానికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి అన్నారు. చెట్ల పెంపకం కార్యక్రమం, విత్తనాల సేకరణ కార్యక్రమాలు ఏడాది పొడవునా చేపట్టాలని స్పష్టం చేశారు. మన వాతావరణ పరిస్తితులను తట్టుకుని త్వరగా పెరిగే మొక్కలను ఎంచుకోవాలని అన్నారు.

ఇందుకోసం ఉద్యాన, అటవీ శాఖలు సంయుక్తంగా పరిశోధనలు చేయాలన్నారు. అమెరికా తరహాలో చెట్ల క్లోనింగ్ పద్దతి ఇక్కడా రావాలని చెప్పారు. అటవీప్రాంతాల్లో నేరేడు, మారేడు, ఉసిరి, వంటి ఔషద గుణాలున్న మొక్కలతో పాటు సీతాఫలం లాంటి పండ్లమొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. ప్రాంతాలవారీగా మొక్కల పెంపకాన్ని డ్వాక్రా గ్రూపులకు అప్పగించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను వారికే ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి స్కూలు, కాలేజి, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల ప్రాంగణాలు వంటి మొక్కలకు రక్షణ కల్పించతగిన అన్ని చోట్లా తప్పనిసరిగా మొక్కల పెంపకం జరగాలని అన్నారు. జలవనరులకు సమీపంలో చెట్లను పెంచడం ద్వారా నీటి సంరక్షణ కూడా సాధ్యమవుతుందని అన్నారు.

కొల్లేరు సరస్సును సంరక్షించి, పర్యాటకులను మరింత ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలోని ఐదు బర్డ్ శాంక్చురీలను అభివృద్ధి చేయాలని, మడ అడవులను కాపాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. టైగర్ ఫారెస్ట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. త్వరిత గతిన తిరుపతి, విశాఖ జూపార్క్ లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవాలని సూచించారు. నగరవనాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, నగరవనాల్లో నెమళ్లు, ఆయుర్వేద వనాల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read