cbn tirupati 06042016

ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య నగరాల్లో ఒకటైన తిరుపతికి తీపి కబురు. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా తిరుపతిలో ఓ భారీ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ లో భాగంగా రోబోటిక్స్ అండ్ అనలైటిక్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘ఏపీ టెక్ మహీంద్రా ఐఐడీటీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ అనలైటిక్స్ ను ఏర్పాటు చేయబోతోంది. త్వరలోనే తిరుపతిలో అది ఏర్పాటవుతుంది’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు విశాఖపట్నంలోనూ వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు టెక్ మహీంద్రా సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానితో విజయవాడలో సమావేశమైన అనంతరం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు.

తిరుపతిలో టెక్ మహీంద్రా నెలకొల్పబోయే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటయ్యాయి. త్వరలోనే అక్కడ ఐఐటీ కూడా రాబోతోంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ఒకటి. చంద్రబాబు ఈ ఆధ్యాత్మిక నగరంపై బాగానే శ్రద్ధ పెడుతున్నారు.

Advertisements

తిరుపతి కి చంద్రబాబు తీపి కబురు.... Last Updated: 06 April 2016