కొండపల్లి ఖిల్లా కోటకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఖిల్లా కోటలో కట్టడాలకు మరమ్మతులు చేపట్టి నూతన శోభ సంతరించుకునేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఏటా కార్తీక మాసంలో జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి కోట అందాలు తిలకిస్తారు. నూతన రాజధాని అమరావతి నగరం ప్రకటన వెలువడిన తర్వాత సందర్శకుల తాకిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఖిల్లాలోని పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఖిల్లా అభివృద్ధికి నిధులు వెచ్చించడంతో భవిష్యత్ కాలంలో సందర్శకులకు మరింత శోభాయమానంగా దర్శనమివ్వనుంది.
చరిత్రకు ఆనవాళ్లగా ఖిల్లా
కొండపల్లి ఖిల్లా చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తుంది. 14వ శతాబ్దంలో ప్రోలాయ వేమారెడ్డి ఖిల్లా నిర్మాణానికి పూనుకున్నారు. అనంతరం 15వ శతాబ్దంలో మహ్మ దీయులు అనంతరం బామిని రాజలు, తర్వాత గజపతి రాజులు, అటు పిదప శ్రీకృష్ణదేవరాయలు ఖిల్లాను స్థావరంగా చేసుకుని పరిపాలన సాగించారు. అప్పట్లో యుద్దాలకు కేంద్రంగా ఖిల్లా ఉండేదని చరిత్ర చెబుతుంది. ఖిల్లాను సందర్శించి చరిత్ర తెలుసుకునేందుకు అనేక ప్రాంతాల వారు వస్తుంటారు.
పురాతన కట్టడాలకు పూర్వవైభవం
శతాబ్దాల చరిత్ర కలిగిన ఖిల్లా శిధిలావస్థకు చేరింది. కట్టడాలకు అంచెలంచెలుగా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రూ.8 కోట్లు విలువ కలిగిన పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించింది. పర్యాటకశాఖ నిధులను పురావస్తుశాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు జరగుతు న్నాయి. శిధిలమైన గోడలను పటిష్టం చేస్తున్నారు. ప్యాచ్ వర్క్లు, అంతర్గత రహదారుల పనులు జరుగుతున్నాయి. కన్వెన్వన్షన్ హాల్ నిర్మాణం, విద్యుత్ తాగు నీరు, టాయిలెట్లు సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంది. 2వేల అడుగు లోతులో బోరు పంపు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ సదుపాయం లేదు.
ఖిల్లా పై కి రోప్ వే ఏర్పాటు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ప్రస్తుత పనుల్లో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఖిల్లాను తొలత రెడ్డిరాజులు నిర్మించారు. వారి పాలనలో నిర్మించిన శిలలు, శిల్పాలను మహ్మాదీయుల కాలంలో కోట గోడలకు వినియోగించినట్లు అనేక సంఘటనలు రుజవు చేస్తున్నాయి.