ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఈ రోజు గవర్నర్ చేసిన నిర్ణయం ఒక చారిత్రక తప్పిదం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఏపి పునర్విభజన చట్టానికి వ్యతిరేకం. అలాంటి నిర్ణయం తీసుకుని, రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తోంది, ఆవేదన కలుగుతోంది. ప్రజలందరూ కరోనాతో ఎక్కడికక్కడ బాధపడుతూ బైటకు రాలేని పరిస్థితి. ఆర్ధికంగా చితికిపోయి, ఉపాధులు కోల్పోయి, సరైన తిండికి కూడా నోచుకోని పరిస్థితి.. అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్తే బెడ్స్ కూడా లేని పరిస్థితి, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండలేక ఇళ్లకే వెళ్లిపోయే దుస్థితి. ఇంట్లో నుంచి బైటకు రావాలంటే ప్రజలంతా భయపడే ఈ పరిస్థితిలో, మళ్లీ ఇలాంటి చిచ్చు ఈ రాష్ట్రంలో తెచ్చారంటే చాలా బాధేస్తోంది, ఆవేదన కలుగుతోంది. ఆంధ్రుల కల అమరావతి. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ను కోల్పోయినప్పుడు, మా బిడ్డల భవిష్యత్ కోసం మేము కూడా రాజధాని కట్టుకోవాలని, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని అందరూ ఆశపడ్డారు. అమరావతి అభివృద్ది అవుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మీకు కూడా లాభం కలుగుతుంది అని చెబితే రైతులు భూములు ఇచ్చారు. 29వేల మంది రైతులు 33వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇస్తే, వాళ్ల నమ్మకానికి ద్రోహం చేయడం దారుణం.

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, అక్కడి భూమితోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుంటే, రాష్ట్రం అభివృద్ది చెందుతుంది, పేదలకు సంక్షేమం అందించవచ్చని ఆలోచించాం. అలాంటి రాజధానిని ఇప్పుడు చిన్నాభిన్నం చేశారు. ప్రజల స్వప్నాన్ని, ఆశలను సర్వనాశనం చేశారు. అమరావతిలో 226రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కొందరు చనిపోయారు, ఆడబిడ్డలు అవమానాల పాలయ్యారు. ఎందుకింత నీచాతినీచంగా ప్రవర్తించారో చెప్పాలి. ఏంటీ పైశాచిక ఆనందం, ఏంటి ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు అని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘‘ఒక రాజధాని’’ అని ఏపి పునర్వవస్థీకరణ చట్టంలో చెప్పారు. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి,ఏ దేశానికి ఎక్కడా 3రాజధానులు లేవు, అలాంటిది 3రాజధానులు తెస్తామని, ఏపి పునర్వవస్థీకరణ చట్టానికే తూట్లు పొడుచే పరిస్థితి కల్పించారు. ‘‘13జిల్లాల చిన్నరాష్ట్రం, మనం మనం గొడవ పడితే రాష్ట్రం నష్టపోతుంది, ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడితే రాష్ట్రం నష్టపోతుందని రాజధానికి ఒప్పుకుంటున్నామని’’ ఎందుకు మడమ తిప్పారని అడుగుతున్నాను.

రాజధాని ఎక్కడైనా పెట్టండి దానికి 30వేల ఎకరాలు కావాలని ఆరోజు చెప్పారు, ఈ రోజు 33వేల ఎకరాలు ఇచ్చారు, దానిని ఎందుకు నాశనం చేస్తున్నారు..? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉంది. ఆరోజు అసెంబ్లీలో మీరే చెప్పారు. మాట చెప్పారు, మభ్యపెట్టారు, ఈ రోజు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. ఈ బిల్లులు సెలెక్ట్ కమిటి వద్ద ఉన్నాయని, సెలెక్ట్ కమిటి రిపోర్ట్ వచ్చాక మేము కోర్టుకు తెలియజేస్తామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. గవర్నర్, కౌన్సిల్ ఛైర్మన్ ఇద్దరూ స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ వ్యవస్థల ప్రతినిధులు. గవర్నర్ ను కలిసి ఈ బిల్లులు సెలెక్ట్ కమిటికి పంపామని కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా చెప్పారు. మళ్లా ఆ 2బిల్లులను తెస్తే, కౌన్సిల్ కు వస్తే గొడవలు జరిగి సైనడే చేశారు. ఆ బిల్లులను పంపిస్తే గవర్నర్ సంతకం పెడతారు. కావాలని అమరావతిపై అపవాదులు వేశారు. భూకంపాలు వస్తాయని, భూముల్లో స్కామ్ లు జరిగాయని ప్రచారం చేశారు. భూమి రైతులది, ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ లో. అమరావతిని ఏదోవిధంగా చంపేయాలనే ఇదంతా చేశారు. చాలా దారుణంగా నీచంగా చేశారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ది వికేంద్రీకరణ. వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలా చేయకుండా రాష్ట్రాభివృద్దికి విఘాతం కల్పిస్తున్నారు. 3రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంటే ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది.

రాజధాని ఇక్కడే ఉంటుందని రైతులకు చెప్పాం. అందుకే 33వేల ఎకరాలు ఇచ్చారు. వాళ్లిచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక పరిశ్రమతో ఒక ఒప్పందం చేసుకుంటే దానిని ఉల్లంఘిస్తే దానిని చక్కదిద్దే యంత్రాంగం ఉంది. ఇది రైతులు చేసుకున్న ఒప్పందం. జెఏసి పిలుపు ఇచ్చిన ఆందోళనలకు తెలుగుదేశం పూర్తి మద్దతు ఇస్తోంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. మీరంతా ముందుకొచ్చి మీ భవిష్యత్తును కాపాడుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి. ఇది తెలుగుదేశం పార్టీకో, చంద్రబాబు నాయుడుకో, కొంతమంది వ్యక్తులకో అన్యాయం కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది. ఎక్కిన చెట్టును నరుక్కుంటూ, మేము చేసిందే రైటని చెప్పుకుని చంకలు ఎగరేసే పరిస్థితిలో వైసిపి ఉంది. ఈ రోజు నా ఆవేదన, ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు అర్ధం అవుతుంది. ఇది నాకెందుకు వచ్చింది, ఇది తెలుగుదేశం సమస్య, చంద్రబాబు సమస్య అని గమ్మున ఉండటం సరికాదు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు దానికి నిరసనలు తెలియజేసి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీపై ఉంది. రాజకీయ పార్టీగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. ప్రజలు కూడా తమ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఈ రోజు అమరావతి రైతులకు అన్యాయం జరిగింది, రేపు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి జరుగుతుందని అనేది గుర్తుంచుకోవాలి.

బాధ్యతలేని ప్రభుత్వం వల్ల చాలా సమస్యలు వస్తాయి. నేను ఆలోచించేది నా ఇంటి కోసమో, నా కుటుంబం కోసమో కాదు. రేపు ఎక్కడికైనా వెళ్తే మీ రాజధాని ఏదని అడిగితే మావి 3రాజధానులని చెప్పుకుని సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. ఒక వ్యక్తి వల్ల, ఒక ప్రభుత్వం వల్ల ప్రజలంతా తలవంచుకునే పరిస్థితి రాకూడదు. కావాలని నామీద అభాండాలు వేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. మీ భవిష్యత్తు కోసమే రాత్రింబవళ్లు రాష్ట్రాభివృద్ది కోసం కృషిచేశాను. మనకెందుకులే అని మీరు గమ్మున ఉంటే నష్టపోయేది 5కోట్ల ప్రజలు, జాతి నష్టపోతుంది, దయచేసి ఆలోచించండి. రాజకీయాలు కక్ష తీర్చుకోవడం కోసం కాదు. రాజకీయాలు పైశాచిక ఆనందం పొందడానికి కాదు. మీ కష్టాలు తీర్చడానికి, మీ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి. ఆ రోజు అమరావతిని రాజధానిగా ఎంపికచేస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా ఇది తప్పు అని చెప్పలేదు, అందరూ ఆమోదించిన రాజాధాని అమరావతి. దాని కోసం త్యాగం చేసిన రైతాంగం అమరావతి రైతాంగం. అందరూ చైతన్యవంతులై అమరావతిని కాపాడుకోవడమే దీనికి పరిష్కార మార్గం. మీరంతా అభిమానించే వ్యక్తిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. రాష్ట్ర ప్రజలుగా మీ బాధ్యత మీరు చేయండి. రాబోయే రోజుల్లో జెఏసి పోరాటానికి మీరంతా మద్దతు ఇవ్వండి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read