రాష్ట్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. కరోనా మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో సోమవారం మృతి చెందినట్లు ప్రకటించింది. మార్చి 30న ఉదయం 11.30 గం.కు వ్యక్తి చెకప్‌కు వచ్చారన్న ప్రభుత్వం.. గంట వ్యవధిలో మ. 12.30 గం.కు చనిపోయారని తెలిపింది. మృతి చెందిన వ్యక్తి కుమారుడు మార్చి 17న దిల్లీ నుంచి వచ్చారన్న ప్రభుత్వం, మార్చి 31వ తేదీన కుమారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యిందని ప్రకటించింది. కుమారుడి నుంచి తండ్రికి వైరస్‌ సోకిందని ప్రభుత్వం భావిస్తుంది. వీరితో కాంటాక్ట్‌ అయిన 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 161కి చేరాయి. ఇవాళ కొత్తగా 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​ పేర్కొంది. నెల్లూరులో ఇవాళ కొత్తగా 8 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం కొవిడ్ 19 కేసులు 32కి చేరాయి.

కడపలో ఇవాళ కొత్తగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కడప జిల్లాలో ఇప్పటివరకు 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఇవాళ కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులతో..మొత్తం కేసుల సంఖ్య 14కి చేరింది. మరో పక్క, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో కరోనా నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స, మోపిదేవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక మరో పక్క, రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ తీసుకునే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ రేషన్‌తోపాటు నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉండేలన్నదే ముఖ్యమంత్రి నిర్ణయంగా చెప్పారు. లబ్ధిదారులందరికీ రూ. 1000 ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్న మంత్రి... ఇందులో 140 మంది దిల్లీ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. మిగిలిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారని వివరించారు. దిల్లీకి వెళ్లిన 1081 మందిలో 946 మంది రాష్ట్రంలో ఉన్నారని... మిగిలిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. 881 మందిని గుర్తించి నమూనాలు పరీక్షకు పంపామని...108 మందికి కరోనా సోకినట్టుగా తేలిందని వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read