క-రో-నా సమయంలో ఎరువులు, పురుగు మందులు భారీగా పెరిగిపోయాయి. ఇది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వేళ, ధర విషయంలోనూ రైతులకు న్యాయం చేస్తారని ఆశపడి సాగుచేశారు. నెల్లూరు జిల్లాలో సాగునీటి ఇబ్బందులున్నా, ఏదో విధంగా కష్టపడి 3 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దాదాపు 9 లక్షల పుట్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లర్లు, దళారులు అడ్డదారుల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. మంత్రి అనిల్‌కుమార్ వచ్చినప్పుడల్లా రైతులకు అన్యాయం జరగనివ్వం, మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. ప్రతి గింజా కొంటాం అంటూ మాటలు చెబుతున్నారు. కలెక్టర్ మాత్రం ప్రతి గింజా కొనుగోలు చేస్తామని పదేపదే చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు వెళితే రాజకీయాలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వైసిపి నేతల సిఫార్సులుంటేనే కొన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. ఏదో సాకు చెప్పి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని తిరిగిపంపుతున్నారు. తేమ శాతం 17 కన్నా ఎక్కువ ఉన్నా కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశాలున్నాయి. కేంద్రాల్లో తీసుకోవడం లేదు.

దాంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక ఆవేదన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాపితంగా ఆకాల వర్షం పండించిన పంటను నీటిపాలు చేస్తుంది. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు, దళారులు రెచ్చిపోతున్నారు. ఒక పథకం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, మిల్లరు, దళారులతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ధాన్యం తీసుకొని అక్కడో, ఇక్కడో తిరగలేక పోతున్నారు. ఇప్పటికే పుట్టికి రూ.4 వేలకు తక్కువకు అమ్ముకుంటున్నారు. మళ్లీ రవాణా ఛారీలు ఎక్కువ అవుతుండడంతో ఎవరికొకరికి అమ్ముకొని ఉసురూమంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం నీటి మూటలుగానే కనిపిస్తున్నారు. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు జరుగుతున్న అన్యాయం పై నోరుమెదపడం లేదు. ప్రకటనలు మాత్రం ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయడం లేదు.

అంతా బాగుంటేనే ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. వర్షాలకు ధాన్యం తడవడంతో రంగుమారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రంగుమారిన ధాన్యం పరిస్థితి ఏమిటనేది రైతులను వేధిస్తోన్న ప్రశ్నగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను పక్కన పెట్టేసి, గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోంది. ప్రభుత్వ తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, అధికారులు మాటలు చెప్పడం మాని, రైతులకు : గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జిల్లాలో రైతులు రోడ్డెక్కుతున్నారు. మంగళవారం సంగం వద్ద రైతులు రోడ్డుపై బైటాయించారు. ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. నెల్లూరు-ముంబాయి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను మోసగించొద్దని నినదించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read