రికార్డుల్లో నా పేరుండడం కాదు, నా పేరుతోనే రికార్డులుంటాయంటారు బాలయ్య. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులలో నా పేరుండడం కాదు, నా కేసులతోనే కేంద్ర దర్యాప్తు సంస్థల రికార్డులు ఉంటాయనేది జగన్ రెడ్డి డైలాగ్. తండ్రి అధికారం చేపట్టినప్పుడు చేసిన హత్యలపై సీబీఐ విచారణతో తన కెరీర్ స్టార్ట్ చేసిన జగన్ రెడ్డి, తన స్థాయికి తగ్గట్టు ఏనాడూ రాష్ట్ర దర్యాప్తు సంస్థల కేసుల్లో లేడు. అన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులే. క్విడ్ ప్రోకోతో 42 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ కేసులో జగన్ రెడ్డి ఏ1గా సీబీఐ, ఈడీ, ఫెమా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలే. అధికారంలోకి వచ్చాక కూడా తన స్థాయిని ఎక్కడా తగ్గించడంలేదు. పీపీఏల రద్దుతో అంతర్జాతీయ సంస్థలతో వివాదాలతో ప్రపంచస్థాయికి చేరింది ఘనత. బాంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడడంతో డీఆర్ఐ(డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్) నమోదు చేసిన కేసులో ఏపీకి చెందిన వ్యక్తే కింగ్ పిన్. ట్రమడాల్ టాబ్లెట్స్ కేసూ వైసీపీ నేతదే. హవాలా మనీ తరలింపు కేసు వైసీపీ నేతలదే. అటు రుషికొండ, ఇటు మడ అడవులు, చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులలో పర్యావరణ నిబందనల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చీవాట్లు, జరిమానాలు ఎదుర్కొంటోంది ఏపీ సర్కారు. మరికొన్ని కేంద్రసంస్థలు కాగ్ వంటివి ఏపీ ఆర్థిక, అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నివేదికలు ఇచ్చాయి. అంతా నా ఇష్టం, చట్టం నా చుట్టం అంటూ నియంతలా జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీని కేంద్రసంస్థల ముందు దోషిగా నిలబెడుతోంది.
news
సాయిరెడ్డిని బుక్ చేసేలా జగన్ వ్యూహం
విజయసాయిరెడ్డిని కొన్నాళ్లుగా తాడేపల్లి ప్యాలెస్కి దూరం పెడుతూ వస్తున్నారు. జగన్ రెడ్డికి అన్నీ తానై ఒకప్పుడు నడిపించే విజయసాయిరెడ్డికి ప్రస్తుతం వైఎస్ జగన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడంలేదని టాక్. అయితే వైకాపా అధినేత పిలిచినా వెళ్లేందుకు సాయిరెడ్డి సుముఖంగా లేరని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.ఉత్తరాంధ్రకి ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించే విజయసాయిరెడ్డిని మొదట ఆ సమన్వయకర్త పోస్టు పీకేశారు. ఆ తరువాత అనుబంధసంఘాల అధ్యక్ష పదవి మూణ్ణాళ్ల ముచ్చట చేశారు. సోషల్మీడియా ఇన్చార్జి పోస్టుని సజ్జల భార్గవ్ రెడ్డికి కట్టబెట్టేశారు. ఢిల్లీలో వైకాపా లాబీయింగ్ చూసే విజయసాయిరెడ్డిని తప్పించి మిధున్ రెడ్డికి అప్పగించారు. దీంతో పవర్, పదవుల్లేని సాయిరెడ్డి మౌనం పాటిస్తూ వస్తున్నారు.
వైఎస్ జగన్ రెడ్డికి జనంలో ఇమేజ్ దెబ్బతింది. పార్టీలో ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు. ఈ సమయంలో సొంత బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూనారు. బాలినేని సమన్వయకర్త పదవి వద్దని వచ్చేశారు. ఈ పోస్టుని ఎలాగైనా సాయిరెడ్డికి కట్టబెట్టి, ఆ ప్రాంత ఓటమిని సాయిరెడ్డి ఖాతాలో వేసేయాలని సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి బలమైన వ్యూహం పన్నారు. అయితే తెలివిగా సాయిరెడ్డి తప్పించుకు తిరుగుతూ ఆ బాధ్యతలు స్వీకరించడంలేదు. ఢిల్లీలోనూ బీజేపీ పెద్దలతో లాబీయింగ్ చేసుకుంటూ, టిడిపిని తిట్టకుండా సోషల్మీడియా స్ట్రాటజీ మార్చేశాడు.
ప్లాన్ మార్చిన అవినాష్ రెడ్డి.. అసలు సిబిఐ లెక్క ఏంటి ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సీబీఐతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆడుతున్న దొంగా-పోలీస్ ఆటలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చేసింది, చేయించింది ఎవరో సీబీఐ అఫిడవిట్ల ద్వారా చెప్పకనే చెప్పేసింది. నిందితులంతా అరెస్ట్ తప్పదని ఫిక్సయిపోయారు. కింగ్ పిన్ అయిన అవినాశ్ రెడ్డి ఏ ఎంపీ సీటు కోసం వివేకానందరెడ్డిని చంపేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో, అదే హత్యకేసులో అరెస్టయితే దానిని సానుభూతి పొందేలా వాడుకోవాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ కేసులో అదృశ్యశక్తి ద్వారా అంతా నడిపిస్తున్న అన్న సూచనల మేరకు సీబీఐతోనే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే సామాన్యులు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎవరెవరిని, ఏ కోణంలో విచారించాలో అవినాష్ రెడ్డి చెబుతుంటే, సీబీఐ అదే చేస్తోంది. విచారణకి తాను ఏ తేదీన రావాలని అనుకుంటున్నాడో అదే తేదీన రమ్మంటోంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయని చెబితే సీబీఐ విచారణ నుంచి మినహాయింపు ఇస్తోంది. వీటన్నింటినీ చూశాక, సామాన్యులకి కూడా అర్థం అవుతున్న విషయం ఏంటంటే, ఈ కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటానికి ఏపీలో సర్కారీ పెద్ద, కేంద్ర పెద్దలు బాగానే కృషి చేస్తున్నారని తేలిపోతోంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, సీబీఐ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తనను అరెస్ట్ చేయాలో అవినాష్ రెడ్డి నిర్దేశిస్తున్నట్టు వరస పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో తన బదులు అభిషేక్ రెడ్డి బాద్యతలు చూస్తారని అప్పగింతలు చేసి వచ్చిన అవినాష్ రెడ్డి...తన అరెస్టు తన జనం మధ్యలో జరిగేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. జనం నుంచి సానుభూతి పొంది వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు మార్గం సుగమం అవుతుందని, అందుకే సీబీఐతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలుస్తోంది.
టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంలో వైకాపా బొక్కబోర్లా
తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంలో అధికార వైసీపీ బొక్కబోర్లా పడిందని వరస సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతలు, సంస్థలు ఇవేనని ఫిక్స్ అయిపోయిన వైసీపీ వ్యూహకర్తల బృందం అందరినీ ఒకేసారి అష్టదిగ్బంధనం చేయాలనే వ్యూహం దారుణంగా బెడిసికొట్టింది. ఇప్పుడు ఎటువైపు అడుగులు వేయాలో తెలియక అయోమయం జంక్షన్లో జామ్ అయిపోయారు జగన్ అండ్ కో. టిడిపిలో కీలకనేతలందరినీ కేసులతో ఫిక్స్ చేశామనుకుంటే, ఆ నేతలంతా మరింత యాక్టివ్ అయిపోయారు. కేసులు-అరెస్టులకి భయపడి తగ్గుతారనుకుంటే వారు మరింత రెచ్చిపోతున్నారు. అయ్యన్న, అచ్చెన్న, కొల్లు రవీంద్ర, ధూలిపాళ్ల నరేంద్ర, బీటెక్ రవి, ఆదిరెడ్డి వాసు, పట్టాభి వంటి కీలక టిడిపి నేతలందరినీ ఏదో ఒక కేసులో అరెస్టు చేశారు. బెయిల్ వచ్చాక, ఈ నేతలంతా వైకాపాకి చుక్కలు చూపిస్తున్నారు. టిడిపి కేంద్ర కార్యాలయం ఏదో భూవివాదం అంటూ కేసులు, నోటీసులు ఇచ్చారు. సాక్షిలో ఇక టిడిపికి ఆ ఆఫీసే ఇక లేదని కథనాలు రాసేశారు. అదీ పోయింది. మాజీమంత్రి నారాయణని టార్గెట్ చేశారు. వరస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసి అలిసిపోయారు. ఈ సారి ఏనుగు కుంభస్థలం కొట్టామనుకుని ఈనాడు లక్ష్యంగా మార్గదర్శిపై తనిఖీలు-సోదాలకి తెగబడ్డారు. ఉండవల్లిని దింపారు. 15 రోజుల ఎపిసోడ్ తుస్సుమంది. ఇప్పుడు కరకట్టపై చంద్రబాబు ఇంటిని ప్రభుత్వానికి అటాచ్ చేశారు. అదీ లింగమనేని ఇల్లు. అద్దెకి ఉంటున్నారు చంద్రబాబు. ఈ ఘట్టం తుస్సుమంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసులు ఏమయ్యాయో తెలియదు. ఎటు వేళ్లాలో తెలియదు. ఏం చేయాలో తెలియని దిక్కుతెన్నూ తెలియని వ్యూహంలో అష్టదిగ్బంధనంలో టిడిపిని ఇరకాటంలో పెట్టేశామనుకుంటున్న వైసీపీ పీకల్లోతు సంకటంలో కూరుకుపోయింది.