సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి, సచివాలయ ఉద్యోగులు చుక్కలు చూపించారు. నిన్న ఆయన్ను దాదాపుగా ఘెరావ్ చేసినంత పని చేసారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో, ప్రభుత్వం చెప్పిన దానికి తల ఊపి బయటకు వచ్చి, అందరం సంతోషంగా ఉన్నాం అని చెప్పటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అషుతోష్ మిశ్రా నివేదిక ఏదైతే ఉందో, అందుకు అనుగుణంగానే మీరు పీఆర్సీ ఒప్పుకోవాలని చెప్పాం కదా, మరి మీరు వెళ్లి అక్కడ ఇవేమీ చెప్పకుండా, ఎందుకు తిరిగి వచ్చారని, ఆగ్రహం వ్యక్తం చేసారు. సచివాలయ ఉద్యోగ సంఘం తరుపున, మీరు మీ వాదనలు ఎందుకు గట్టిగా వినిపించలేక పోయారని, ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫిట్ మెంట్ విషయంలో తగ్గింపుకు మేము అంగీకరించం అని చెప్పినా కూడా, మీరు అక్కడకు వెళ్లి ఎందుకు అంగీకరించారు అని అడిగారు. పదవ పీఆర్సీ ఉన్నది ఉన్నట్టు అమలు పరిచి, 27 శాతం ఐఆర్ ను, అయుదు డీఏలు ఇచ్చి, అదే కొనసాగించినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. అలాంటిది ఇప్పుడు తమకు తగ్గించి, కొత్త ఫిట్ మెంట్ ఇస్తే ఎలా అంగీకరిస్తామని, కొత్త పీఆర్సీకి తాము ఒప్పుకోమని వారు తేల్చి చెప్పారు. దీని పై సిఎంఓ అధికారులతో మాట్లాడి, ప్రభుత్వ పెద్దలను ఒప్పించాలని అన్నారు.
కొత్త పీఆర్సీ తమకు అవసరం లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. 62 ఏళ్ళ వయసుకు రిటైర్మెంట్ ఎవరు అడిగారని, అలా చేయటం వల్ల, సచివాలయ ఉద్యోగుల్లో చాలా మందికి, 15 ఏళ్ళ వరకు కూడా ప్రొమోషన్లు లేకుండా అయిపోతారని, ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించం అని, తక్షణం దీని పైన నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వ పెద్దల పై ఒత్తిడి తేవాలని అన్నారు. 30 శాతం HRAను యధావిధగా కొనసాగించాలని డిమాండ్ చేసారు. 2018 నుంచి సచివాలయం జాయిన్ అయిన వారికి, 30 శాతం HRA అమలు కావటం లేదని, అది కూడా అమలు అయ్యేలా చూడాలని అన్నారు. తాము పెట్టిన డిమాండ్స్ అన్నీ కూడా, ఒక రిప్రజంటేషన్ రూపంలో, సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకటరామి రెడ్డికి ఇచ్చారు. ఉద్యోగస్తులు అందరూ ఆయన చుట్టూ గుమికూడి, తీవ్ర నిరసన తెలిపారు. త్వరలో జనరల్ బడీ మీటింగ్ పెట్టాలని, మొత్తం అక్కడే తేల్చుకుంటాం అంటూ, వెంకట్రామి రెడ్డికి తేల్చి చెప్పారు, సచివాలయ ఉద్యోగులు. మరి ఏమి అవుతుందో చూడాలి.