అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించటం, అక్కడ నుంచి గవర్నర్ వద్దకు రావటం, గవర్నర్ ఆమోదించటం చకచకా జరిగిపోయాయి. దీని పై రైతులు కోర్టుకు వెళ్ళగా, ఈ రోజు కోర్టు 14 వరకు స్టేటస్ కో ఇస్తూ, యధాతధ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఇస్తూ, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చెయ్యమని ఆదేశించింది. ఇది ఇలా ఉంటే, మూడు రాజధానులు అనేది కోర్టుల ముందు నిలవదు అని, ఇందుకు జగన్ ప్రభుత్వం చేసిన చట్టంలో ఉన్న లోపాలే కారణం అంటున్నారు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న, మూడు రాజధానులు, అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం పై, తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని ఏర్పాటు అనేది, చట్ట ప్రకారం జరిగింది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పొందు పరిచిన అంశం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు అవకాసం వచ్చిందని అన్నారు.

ఆ చట్టంలో "ఏ కాపిటల్" (ఒక రాజధాని) అని ఉన్న విషయం ఆయన ప్రస్తావించారు. చట్టంలో కాపిటల్ అని ఉందని, కాపిటల్స్ అని లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా, కేంద్రం చేసిన చట్టానికి లోబడి ఉండాలని, ఇక్కడ అలా జరగకుండా, మూడు రాజధానులు చేసారని అన్నారు. ఇక హైకోర్టు అనేది మార్చటం, ఏ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాని పని అని అన్నారు. హైకోర్టు మార్పు ముందుగా హైకోర్టు జడ్జీలు ఇష్ట ప్రకారం, తరువాత సుప్రీం కోర్టు ఇష్ట ప్రకారం, ఆ తరువాత ప్రెసిడెంట్ అఫ్ ఇండియా సమ్మతితో హైకోర్టు మార్పు ఉంటుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా చట్టంలో పెడుతుంది అని అన్నారు. ఇక ఆర్ధిక బిల్లులు కానివి, అసెంబ్లీ ఇష్టం వచ్చినట్టు చెయ్యటం కుదరదు అని, మండలి సెలెక్ట్ కమిటీకి పంపించిన సమయంలో, దాన్ని ఆమోదిస్తే, రాజ్యాంగ విరుద్ధం అవుతుందని అన్నారు. ఇక రైతులు చేసిన అగ్రిమెంట్లు ఉండనే ఉన్నాయని, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే, ఈ బిల్లులు న్యాయ స్థానాల్లో నిలవవు అని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల గౌడ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read