ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వైఖరి ఏమో కానీ, ఏ స్టాండ్ తీసుకోవాలో అర్ధం కాక, ఇదేమి స్టాండ్ అంటూ ప్రశ్నిస్తున్న వారిని వరుస పెట్టి సస్పెండ్ చేసి పడేస్తున్నారు, కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అమరావతి ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ, జగన్ మోహన్ రెడ్డిని ఆపుతుంది అనే నమ్మకం ఉండేది. కానీ సోము వీర్రాజు అధ్యక్షడు అయిన తరువాత, అందరికీ ఆ ఆశలు పోయాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒకటి అందరికీ తెలిసిన విషయం, సోము వీర్రాజు జగన్ కు అనుకూలం, చంద్రబాబుకి వ్యతిరేకం. ఆయన మాట్లాడే మాటలు ఇప్పటికే అలాగే ఉంటాయి. రెండోది గవర్నర్ ద్వారా బీజేపీ ఆడిస్తున్న ఆట. వీటి అన్నిటి నేపధ్యంలో, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించటం. ఒకరు ఏమో, అమరావతికి బీజేపీ అనుకూలం, మూడు రాజధానులు ఎట్టి పరిస్థితిలోనూ మేము ఒప్పుకోం, కేంద్రం జోక్యం చేసుకునే సమయంలో జోక్యం చేసుకుంటుంది అంటారు.

మరొకరు అసలు కేంద్రానికి ఏమి సంబంధం, కేంద్రం జోక్యం చేసుకోదు అంటారు. మరొకరు అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదు, మేము పోరాడతాం, కానీ రాయలసీమలో రాజధాని రావాలి అంటారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీంతో బీజేపీలోని నేతలు కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే, ఇదేమి విధానం మనకు ఒక విధానం లేదా అనే వాళ్ళని, సస్పెండ్ చేసి పడేస్తున్నారు సోము వీర్రాజు. మొన్న ఓవీ రమణ, అమరావతి పై బీజేపీ వైఖరి అర్ధం కావటం లేదు అన్నారని, అతన్ని సస్పెండ్ చేసారు. ఈ రోజు, వెలగపూడి గోపాలకృష్ణ‌ను సోము వీర్రాజు సస్పెండ్ చేసారు. నిన్న అమరావతి రైతుల వద్దకు వెళ్లి, అమరావతి రైతుల కోసం, బీజేపీ ఏమి చెయ్యలేక పోతుంది, క్షమించండి అంటూ చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసారు సోము వీర్రాజు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అయితే వస్తుంది, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న జీవీఎల్ ని ఎందుకు సస్పెండ్ చెయ్యటం లేదు ? అసలకే 0.6 శాతం ఓట్లు వచ్చిన పార్టీ, ఇలా సస్పెండ్ చేసుకుంటే పోయే బదులు, బీజేపీ ఒక విధానంతో, ముందుకు రావచ్చుగా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read