నీటిలో, రోడ్డు పైనా వెళ్లే బస్సు నగరానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజధానికి పర్యాటకానికి శోభను తెచ్చే ఈ వాహనాలను ఇక్కడికి రప్పించారు. దీని ద్వారా కృష్ణా నదిలో జల విహారంతో పాటు అమరావతి పరిధిలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాలను తిలకించే వీలు కల్పిస్తారు.
ట్రాలీపై గోవా నుంచి భవానీపురం బైపాస్ రహదారి మీదకు తీసుకుని వచ్చారు. పన్నమిఘాట్ నుంచి నదిలోకి దిగేందుకు వీలుగా ర్యాంప్ నిర్మించారు. ఇది కొంత వరకే ఉందని, నదిలోకి దింపితే ఇసుక, మట్టిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. నదిలో ర్యాంప్ నిర్మిస్తే బస్సు సజావగా వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఒకటి రెండు రోజుల్లో ట్రయల్రన్ నిర్వహించి అమరావతి పరిధిలో తిప్పనున్నారు.
ఇలా పనిచేస్తుంది..
ఆరు చక్రాలు ఉన్న ఈ బోటు కం బస్ళు రహదారి పై సాధారణ వాహనం మాదిరిగానే వస్తుంది. నదిలోకి వెళ్లినప్పుడు చక్రాలు ఆగిపోతాయి. దిగువన ఉన్న ఫ్యాన్, చుక్కానీ ద్వారా బోటు ముందుకు వెళ్తుంది. 30మంది కూర్చుని ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికులు ధరించేందుకు లైఫ్ జాకెట్లు ఉన్నాయి. ఇది విజయవంతమైతే మరిన్ని తీసుకువచ్చేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.