చంద్రబాబు తపన అభినందనీయం.. నవ్యాంధ్రకు భవ్యమైన భవిష్యత్తు.. "బెజవాడ చాలా మారింది. అమరావతి అభివృద్ధికి చేపట్టిన ప్రణాళిక బాగుంది. అభివృద్ధి, పెట్టుబడుల కోసం చంద్రబాబు తపన అభినందనీయం" అంటూ పలువురు ప్రముఖులు ప్రశంసించారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఎయిర్షోలో పాల్గొన్న విదేశీ వియానయాన రంగ ప్రముఖులు పలువురు దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.
"చంద్రబాబు ముందు చూపుతో చేస్తున్న అభివృద్ధి కారణంగా ఏపీ నుంచి విదేశాలకు వలసలు ఆగిపోతాయి. ఇప్పటికే విదేశాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి" అని సింగపూర్కు చెందిన నార్డిక్ ఏవియేషన్ క్యాపిటల్ కంపెనీ (ఎయిర్క్రాప్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్) వైస్ ప్రెసిడెంట్ బ్రూనో అభిప్రాయపడ్డారు. విజయవాడలో రోడ్లు బాగున్నాయని, మహాత్మాగాంధీ రోడ్డులో విభిన్నమైన షాపులు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆంధ్రా వంటకాలు చాలా నచ్చాయని లేఖలో రాశారు. "విజయవాడలో నా రెండు రోజుల పర్యటన ఎన్నో మంచి అనుభూతులను మిగిల్చింది. రానున్న రోజుల్లో భవ్యమైన ఆంధ్రప్రదేశ్ సాక్షాత్కారమవుతుందనడంలో సందేహం లేదు" అని బ్రూనో అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోని పలు దేశాల రాజధానులను విహంగ వీక్షణంలో చూసిన కెప్టెన్ జైసింగ్ రాసిన లేఖలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. "గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు విమానం నుంచి చూస్తే విజయవాడ దేదీప్యమానంగా విద్యుతకాంతులతో వెలిగిపోతూ కనిపించింది. గతంలో కూడా విజయవాడకు విమానాలు నడుపుతూ వచ్చాను. ఈసారి మాత్రం అభివృద్ధి చెందిన విజయవాడ కనిపించింది" అని జైసింగ్ తన లేఖలో తెలిపారు. విజయవాడ నగరం గురించి తన సతీమణికి చెబుతుండగా... కారు డ్రైవర్ జోక్యం చేసుకొని "విభజన తర్వాత, చంద్రబాబు సీఎం అయ్యాక విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. ఈ రోడ్లు, లైట్లు ఆయన వచ్చిన తర్వాత వేసినవే" అని చెప్పారని లేఖలో ప్రస్తావించారు. రెండున్నరేళ్లలోనే పెట్టుబడిదారులను ఆకట్టుకోవడమే కాకుండా... హైదరాబాద్కు విజయవాడ దీటుగా నిలుస్తోందని జైసింగ్ ప్రశంసించారు.