కె.ఎల్.రావు పార్కు... విజయవాడలో అప్పట్లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పార్కులో ఉన్న బోటు షికారు చేసి ఆనందించేవారు. అయితే గత కొంతకాలంగా పార్కులో కళతగ్గింది. సందర్శకులు కూడా తగ్గిపోయారు. పార్కులో ఉన్న బోటు షికారు అటకెక్కింది. ఆట వస్తువులు మూలన పడ్డాయి. ఏదో పార్కు ఉందంటే ఉందన్నట్లుగా ఉంది.
అయితే ప్రభుత్వం నగరంలోని పార్కుల పై దృష్టి సారించింది. కె.ఎల్.రావు పార్కు కు పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. అందులో భాగంగా మొక్కలను ఆకర్షణీయంగా పెంచటం, కొత్త ఆట వస్తువులు సమకూర్చటం, పార్కుకు రంగులు వెయ్యటం, ఎల్ఈడి లైట్లు, ఓపెన్ జిమ్ , బ్రిడ్జ్ కి రంగులు వెయ్యటం, ఇలా 30 లక్షల రూపాయలతో పార్కు కు పూర్వ వైభవం తీసుకువచ్చారు.
ఆకట్టుకుంటున్న బోటు షికార్
నగరంలోని పార్కులన్నిటిలో కె.ఎల్.రావు పార్కుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏ పార్కులో లేని బోటు షికారు సౌకర్యం ఈ పార్కుకే సొంతం. పున్నమి రాత్రి, చల్లని గాలిలో నదిలో పడవపై షికారు చేస్తుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. మాయాబజార్ సినిమాలో లాహిరి లాహిరి పాటలోని పడవ పై నదీ విహారం చేసినట్లు ఈ పార్కులో బోటు షికారు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ బోటు షికార్ ను, విజయవాడ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రారంభించారు.