రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సమావేశం బుధవారం సాయంత్రం వెలగపూడిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. విజయవాడ పవిత్ర సంగమం దగ్గర వేంకటేశ్వరుని ఆకృతితో ఆలయ శిఖర నిర్మాణానికి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు.
తిరుమలేశుని మూడు నామాలు, దానిపైన ఆలయ గోపురం ఉండేలా, వీటి కింది నుంచి నది ప్రవాహం సాగేలా ఈ నిర్మాణం ఉంటుంది. దశావతారాల థీమ్తో ఆలయ శిఖర ఆకృతికి రూపకల్పన చేసినట్టు బోయపాటి శ్రీను ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పుడు పవిత్ర సంగమం దగ్గర ఉన్న, పవిత్ర హారతి ప్రదేశం కూడా, బోయపాటి డిజైన్ చేసిందే...
గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి అఖండ గోదావరి నుంచి పవిత్ర సంగమం మీదుగా రాష్ట్రంలో జలసిరికి హారతి పడుతున్నామని, అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయం చేయడానికి పూనుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
బోయపాటి సమర్పించిన ఆకృతులపై ఆగమ శాస్త్ర నిపుణులు, టీటీడీ పండితులతో చర్చించి పదిరోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అమరావతిలోనే తిరుమలేశుని ఆలయాన్ని తిరుమల తరహాలో దేదీప్యంగా వుండేలా నిర్మించాలన్నది తన ఆలోచనగా తెలిపారు. రాజధానిలోని పర్వత ప్రాంతంలో వున్న వైకుంఠపురం అందుకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నట్టు తెలిపారు.