నగర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అటానమస్ హోదాను ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల దక్కించుకుంది. ఈ మేరకు UGC, అటానమస్ గుర్తింపు పత్రాన్ని నవంబరు 28న సీల్డ్ కవర్ను పోస్టు ద్వారా పంపిచింది. ఈ హోదా ఆరేళ్ల పాటు అమలులో ఉంటుంది. జిల్లాలో అటానమస్ పొందిన ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఎస్ఆర్ఆర్ కాలేజికి గుర్తింపు రావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులో కళాశాలలో జరుగనున్న నాక్(నేషనల్ అక్రిడేషన్ ఎస్సెస్మెంట్ కమిటీ)లో కళాశాలకు ఉత్తమ గ్రేడ్ వస్తే అటానమస్ హోదాను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తారు. అటానమస్ ద్వారా ఏడాదికి రూ.20 లక్షల చొప్పున ఆరేళ్లపాటు రు.2 కోట్ల వరకు నిధులను యూజీసీ మంజూరు చేయనుంది.
కళాశాలకు అటానమస్ హోదా సాధించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. 2000లో వచ్చిన అటానమస్ కమిటీ కళాశాలకు అటానమస్ ఇవ్వటానికి అంగీకరించలేదు. 2013లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వలూరుపల్లి రవి, జె.ఎస్.రాంప్ర సాద్ నేతృత్వంలో అటానమస్ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. కళాశాలలో వైఫై, సిసి కెమెరాలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్, లైబ్రరీ ఆటోమేషన్, ప్రతి తరగతి గదికి మైక్ వంటి సదుపాయాలు కల్పించారు.
అక్టోబరు నెలలో అటానమస్ కమిటీ కళాశాలను సందర్శించింది. కమిటీ సభ్యులైన ఆచార్యా జేపీ సింగ్, ఆచార్య డాక్టర్ రాజీవ్ చౌదరి, డాక్టర్ పాల్ దయా బరన్, యూజీసీ జేసీ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మిలతో కూడిన కమిటీ కళాశాలలోని విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, ఫలితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి యూజీసీకి నివేదికను అందించింది. కమిటీ నివేదికను పరిశీలించిన యూజీసీ కళాశాలకు అటానమస్ గుర్తింపు మంజూరు చేసింది.
కళాశాల నేపథ్యం ఇదీ.
నూజివీడు జమీందారు రాజా వెంకటాద్రి అప్పారావు బహదూర్ తన తండ్రి రాజా రంగయ్య అప్పారావు బహదూర్ జ్ఞాపకార్ధం 1981లో గవర్నర్పేటలోని రేకుల షెడ్డులో ప్రైవేటు కళాశాలగా కళాశాల ఏర్పాటు చేశారు. అనంతరం మాచవరం తరలించారు. 1945లో చుండూరు వెంకటరెడ్డి కళాశాల మేనేజిమెంట్లో చేరారు. అనంతరం కళాశాల పేరు ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ గా మార్పు చెందింది. 1958లో ఈ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
SRR & CVR కళాశాలలో చదువుకున్న ప్రముఖులు
గవర్నర్లుగా పనిచేసిన పి.ఎస్.రామ్మోహన్ రావు, వి.రామారావు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, రాజకీయ నాయకులు చనమోలు వెంకట్రావు, పాలడుగు వెంకట్రావు, కళాకారులు కోట శ్రీనివాసరావు, జంధ్యాల పెమ్మరాజు సూర్యా రావు, అయ్యగిరి శ్యాంసుందర్ తో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ కళాశాలలో చదువుకున్నారు.