విజయవాడ వాసులు కాని, బయటనుంచి విజయవాడ వచ్చిన వారు కాని, ఆహ్లాదం కోసం, ఇప్పటివరకు భవానీ ఘాట్ నుంచి, భవనీ ఐలాండ్ దాకా వెళ్లి రావటం, అక్కడ ఉన్న కొన్ని వాటర్ గేమ్స్ ఆడుకుని వచ్చేయటమే మనకు తెలుసు... అయితే, తాజాగా అమరావతి వచ్చేవారికి మరపురాని అనుభూతిని చూపించటానికి అమరావతి బోటింగ్ క్లబ్(ఏబీసీ) ముందుకు వచ్చింది... ఇన్నాళ్ళు విజయవాడ, గుంటూరులో ఉన్నా, ఎప్పుడూ కృష్ణమ్మా అందాలు ఇంతలా ఆస్వాదించలేదు అనేంతగా ఆ అనుభూతి ఉండబోతుంది...
దుర్గాఘాట్ నుంచి పవిత్రసంగమం వరకు, 20 కిలోమీటర్లు మేర, 8 ప్రాంతాలు తిరుగుతూ, దాదాపు రెండు గంటలు కృష్ణమ్మ అందాలు చూసే వీలు కల్పించింది అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ) ... ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం మేరకు, అమరావతి బోటింగ్ క్లబ్ ఈ బోటు షికారు అందుబాటులోకి తెచ్చింది...
దుర్గా ఘాట్ నుంచి ప్రతి గంటకు ఒక బోటు దుర్గాఘాట్లో సిద్ధంగా ఉంటుంది. ఒక ట్రిప్లో వందమంది ప్రయాణించే వీలుంది. తలకు రూ.300ని అమరావతి బోటింగ్ క్లబ్(ఏబీసీ) యాజమాన్యం వసూలు చేస్తుంది. అదే ఒక వైపు మాత్రమే అయితే, రూ.300 వసూలు చేస్తారు. వీకెండ్స్ లో, అమరావతి చరిత్ర, మన ఘన చరిత్ర ఇలా అన్నిటి మీద బుర్రకథలతో కూడా బోటు షికారులో అలరించనున్నారు.
రెండు గంటలపాటు సాగే ఈ బోటు షికారు ముందుగా దుర్గా ఘాట్ నుంచి బయలుదేరి, పున్నమి ఘాట్కి బోటు చేరుకొంటుంది. అక్కడ నుంచి భవానీ ఐల్యాండ్కి, అటునుంచి మడ అడవుల మీదగా నడుస్తుంది. ఈ దారిలో రకరకాల పక్షులను, నీటి కుక్కలు తదితర జంతువులను చూస్తుండగానే.. గొల్లపూడి అంజనేయ స్వామి ఆలయానికి చేరిపోతారు. అక్కడ దర్శనాలు అయిన తరువాత నేరుగా.. పవిత్ర సంగమం చేరుకొంటారు. ఇది కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన ప్రదేశం. అక్కడున్న శివాలయాన్ని దర్శించుకొని.. వెనుదిరుగుతారు. ఇలా ఎనిమిది ప్రాంతాలను 20 కిలోమీటర్ల మేర చుట్టుకొంటూ.. బోటు షికారు సాగుతుంది.